కవులు, కళాకారులను ప్రోత్సహించడం ప్రభుత్వ బాధ్యతన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గ్రామీణ ప్రాంతాల కళాకారులను మరింత ప్రోత్సహిస్తామని చెప్పారు. అవార్డులతో మట్టిలో మాణిక్యాల ప్రతిభ వెలుగులోకి వస్తుందన్నారు. చప్పట్లు, దుప్పట్లు కాదు కళాకారులకు నగదు సాయం కూడా అందిస్తామని తెలిపారు సీఎం . ఒక్కో పద్మశ్రీ అవార్డు గ్రహీతకు రూ.25 లక్షల ఆర్థిక సాయం... పద్మశ్రీ కళాకారులకు నెలకు రూ. 25 వేల పెన్షన్ అందిస్తామని ప్రకటించారు. సంప్రదాయలు, భాషను గౌరవించుకునే విషయంలో మనమంతా ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు.
పద్మ అవార్డులకు ఎంపికైన తెలుగు వారిని తెలంగాణ ప్రభుత్వం సత్కరించింది. హైదరాబాద్లోని శిల్పకళావేదికలో ఈ కార్యక్రమం జరిగింది. పద్మవిభూషణ్ పురస్కారానికి ఎంపికైన చిరంజీవి, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో పాటు పద్మశ్రీ అవార్డులు అందుకోనున్న వారిని సీఎం, మంత్రులు సత్కరించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు.
వెంకయ్య నాయుడికి సన్మానం అంటే మనల్ని మనం సన్మానించుకోవడమేనని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీ వెళ్లే తెలుగు రాజకీయ నేతలకు వెంకయ్య నాయుడు పెద్ద దిక్కుఅని చెప్పారు. ఆయనకు రాష్ట్రపతి అయ్యేు అన్ని అవకాశాలు ఉన్నాయన్నారు. చిరంజీవి కమిట్ మెంట్ ఉన్న నటుడని చెప్పారు. పున్నమినాగులో ఏ స్థాయిలో నటించారో.. సైరాలోనూ అదే స్థాయిలో నటించారని తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చిరంజీవి పేరు తెచ్చుకున్నారని కొనియాడారు. గొప్ప వ్యక్తుల పోత్సాహంతో ప్రజాపాలన కొనసాగిస్తామని చెప్పారు సీఎం రేవంత్.