హైదరాబాద్ సిటీలో మరో మూడు స్కైవాక్లు.. ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్, ఐకియా వద్ద నిర్మాణం

హైదరాబాద్ సిటీలో మరో మూడు స్కైవాక్లు.. ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్, ఐకియా వద్ద నిర్మాణం

హైదరాబాద్​సిటీ, వెలుగు :  గ్రేటర్ లో రోడ్డు దాటడానికి పాదచారులు పడుతున్న కష్టాలు, ట్రాఫిక్​సమస్య నివారణకు నగరంలోని మరో మూడు ప్రాంతాల్లో స్కైవాక్​లు నిర్మించడానికి హెచ్ఎండీఏలోని హుమ్టా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. మెట్రోస్టేషన్లు, బస్టాండ్లను కలుపుతూ సమీప కాలనీలకు లింక్​చేయడం ద్వారా ట్రాఫిక్​సమస్య తగ్గించవచ్చని భావిస్తోంది.

అందులో భాగంగానే అత్యంత రద్దీగా ఉండే ఉప్పల్​చౌరస్తాలో స్కైవాక్​నిర్మించగా, మంచి ఫలితాలు కనిపించాయి. దీంతో మెహిదీపట్నంలో స్కైవాక్​పనులు ప్రారంభించి పూర్తి చేశారు. త్వరలో దీన్ని ప్రారంభించనున్నారు. ఇక సికింద్రాబాద్​రైల్వే స్టేషన్​పరిసరాల్లో ఒకటి, కూకట్​పల్లి జేఎన్టీయూ వద్ద మరో స్కైవాక్ నిర్మించాలని ఇప్పటికే నిర్ణయించారు. వీటితో పాటు మరో మూడు ప్రాంతాల్లో స్కైవాక్​ల నిర్మాణానికి ప్రపోజల్స్​రెడీ చేశారు. 

ఆ మూడు ప్రాంతాలు ఏవంటే..

విజయవాడ, నల్గొండ నేషనల్​హైవేను కలిపే ఎల్బీనగర్​చౌరస్తా అత్యంత రద్దీగా ఉంటుంది. రోజూ వేల సంఖ్యలో వాహనాల రాకపోకలతో ఇక్కడి రోడ్డు దాటాలంటే ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. ఇక్కడ కూడా మెట్రోస్టేషన్, బస్టాప్​ను కలుపుతూ సమీపంలోని కాలనీలకు వెళ్లేలా స్కైవాక్​నిర్మించనున్నారు. అలాగే అతిపెద్ద కమర్షియల్​సెంటర్​గా, కోచింగ్​ సెంటర్లకు అడ్డాగా పేరున్న దిల్​సుఖ్​నగర్..రోజూ స్థానిక, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వ్యాపారులు, స్టూడెంట్స్​తో కిటకిటలాడుతూ ఉంటుంది.

ఇక్కడ బస్సులు దిగిన వారు రోడ్డు దాటడానికి కష్టాలు పడుతున్నారు. ఇక్కడ కూడా మెట్రోస్టేషన్, బస్​స్టేషన్లను కలుపుతూ స్కైవాక్​నిర్మిస్తారు. ఇక ట్రాఫిక్​సమస్యకు ప్రధాన కేంద్రమైన ఐటి కారిడార్​లోని రాయదుర్గం మెట్రో స్టేషన్, బస్​స్టేషన్లను కలుపుతూ ఐకియా వద్ద స్కైవాక్​ నిర్మించబోతున్నారు. వీటికి సంబంధించిన పూర్తి రిపోర్ట్​ సిద్ధమయ్యాక టెండర్లను ఆహ్వానించనున్నట్టు అధికారులు  తెలిపారు.