ఎంగేజ్‌మెంట్‌ అయిన జంట: పెళ్లి షాపింగ్‌కు వెళ్తుండగా MMTS రైలు ఢీకొట్టి మృతి

ఎంగేజ్‌మెంట్‌ అయిన జంట: పెళ్లి షాపింగ్‌కు వెళ్తుండగా MMTS రైలు ఢీకొట్టి మృతి

కొద్ది రోజుల్లో కలిసి ఏడడుగులు నడవాల్సిన జంట.. ట్రాక్ దాటుతుండగా ట్రైన్ ఢీకొట్టి ప్రాణాలు కోల్పోయారు. నిండు నూరేళ్లు సుఖసంతోషాలు పంచుకోవాలనుకున్న ఆశతో నిశ్చితార్థం చేసుకున్న ఆ ఇద్దరు.. దురదృష్టవశాత్తు జంటగా మృత్యువు ఒడిలోకి కలిసిపోయారు. హైదరాబాద్‌లోని చందానగర్‌లో జరిగిన ఈ విషాదం అందరినీ కలచివేసింది.

చందానగర్‌కు చెందిన మనోహర్ (24), సోనీ (17)కి ఇటీవలే పెద్దలు ఎంగేజ్‌మెంట్‌ చేశారు. ఫిబ్రవరిలో పెళ్లికి ముహుర్తం ఫిక్స్ చేశారు. MMTS ట్రైన్‌లో సిటీకి వెళ్లి పెళ్లి షాపింగ్ చేద్దామని ఆ యువ జంట ఇంటి నుంచి మంగళవారం ఉదయం  బయలుదేరింది. సరదాగా ఊసులు చెప్పుకుంటూ నడిచి వెళ్తున్న మనోహర్, సోనీ చందానగర్ స్టేషన్‌లో ట్రాక్ దాటుతుండగా ఘోరం జరిగిపోయింది. మాటల్లో పడి MMTS ట్రైన్ వస్తున్నది గమనించలేదు ఆ ఇద్దరు. దీంతో రైలు ఢీకొట్టడంతో మనోహర్, సోనీ ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. మృతదేహాలను పోస్టుమార్టానికి పంపిన పోలీసులు.. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

కొద్ది రోజుల్లో పచ్చగా పెళ్లి తోరణాలతో కళకళలాడాల్సిన వారి ఇంట ఈ ఘటన పెను విషాదాన్ని నింపింది. చక్కగా పెళ్లి చేద్దామనుకున్న వాళ్లు విగత జీవులుగా పడి ఉండడం చూసి కుటుంబసభ్యులు భోరున విలపిస్తున్నారు.

More News:

స్నైపర్‌తో కాల్చినా సేఫ్: ఫుల్ బాడీ బుల్లెట్ ప్రూఫ్ తయారుచేసిన ఆర్మీ మేజర్

CAAపై బీజేపీలో వ్యతిరేక గళం.. పౌరసత్వానికి, మతంతో లింక్ ఏంటీ?