ధోని కోసం నాకు అన్యాయం చేశారు: పాక్ మిస్టరీ స్పిన్నర్

ధోని కోసం నాకు అన్యాయం చేశారు: పాక్ మిస్టరీ స్పిన్నర్

నిరాధార ఆరోపణలు చేయాలన్నా.. నోటికొచ్చింది వాగాలన్నా పాక్ క్రికెటర్ల తరువాతే ఎవరైనా. ఈ విషయాన్ని ఆ దేశ క్రికెటర్ మరోసారి నిరూపించారు. ధోనీ వల్ల తనకు అన్యాయం జరిగిందంటూ పాకిస్తాన్ మాజీ మిస్టరీ స్పిన్నర్ సయ్యద్ అజ్మల్ సంచలన ఆరోపణలు చేశాడు. అతనికి దక్కాల్సిన 'మ్యాన్ అఫ్ ది మ్యాచ్' అవార్డ్ ధోనికి ఇచ్చారన్నది ఆరోపణ. ఈ ఘటన ఎప్పుడు జరిగింది? అతని ఆరోపణలు నిజమేనా? అన్నది తెలుసుకుందాం.. 

2012-13లో పాకిస్తాన్ జట్టు.. రెండు టీ20లు, మూడు వన్డేల సిరీస్ కోసం ఇండియాలో పర్యటించింది. ఈ టూర్‌లో టీ20 సిరీస్‌ 1-1 తేడాతో సమం కాగా, వన్డే సిరీస్‌ని 2-1 తేడాతో పాక్ సొంతం చేసుకుంది. మొదటి రెండు వన్డేల్లో ఓడిన టీమిండియా.. మూడో వన్డేలో విజయం సాధించి పరువు కాపాడుకోగలిగింది. అజ్మల్.. ధోనీపై చేస్తున్న ఆరోపణలు ఈ ఆఖరి వన్డే గురుంచే. 

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 43.4 ఓవర్లలో 167 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యింది. ఎంఎస్ ధోనీ 36 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. సురేష్ రైనా 31 పరుగులతో పర్వాలేదనిపించాడు. పాక్ బౌలర్లలో సయ్యద్ అజ్మల్ 24 పరుగులకే 5 కీలక వికెట్లు పడగొట్టి, టీమిండియా పతనానికి కారణమయ్యాడు. అనంతరం 168 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన పాక్ 157 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో ఇషాంత్ శర్మ 3 వికెట్లు తీయగా.. భువనేశ్వర్ కుమార్, అశ్విన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. 

ఈ మ్యాచ్‌లో ఇండియా విజయం సాధించినందుకు గానూ టాప్ స్కోరర్‌గా నిలిచిన ధోనీకి 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' ప్రకటిస్తారు. ఇది అన్యాయం అంటున్నాడు అజ్మల్.


"నన్ను దురదృష్టం వెంటాడింది అనడానికి 2013 టీమిండియా పర్యటన ఒక ఉదాహరణ. టీ20 సిరీస్ సమం అయినా.. వన్డే సిరీస్ లో మేము అద్భుతంగా రాణించాం. మొదటి రెండు వన్డేలు గెలిచాం. మూడో వన్డేలో వారిని 170లోపే ఆలౌట్ చేశాం. కానీ దురదృష్టవ శాత్తూ గెలవలేకపోయాం. ఆ మ్యాచ్‌లో నేను 5 వికెట్లు పడగొట్టా. 'మ్యాన్ అఫ్ ది మ్యాచ్' అవార్డ్ నాకు దక్కాలి. కానీ అలా జరగలేదు. నన్ను కాదని ధోనీకి ఇచ్చారు. ఆ మ్యాచ్‍లో ధోనీ చేసింది.. 18 పరుగులు. అందులోనూ రెండు క్యాచులు డ్రాప్. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరికి ఇస్తారు? మ్యాచ్‌లో బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చిన ఆటగాడికి. మరి అలా జరగలేదే. ఇండియా గెలిచిందని ధోనీకి ఇచ్చుకున్నారు." అని అజ్మల్ తాజాగా చెప్పుకొచ్చాడు. 

అజ్మల్ ఆరోపణలు పచ్చి అబద్ధాలు.. 

ఆ మ్యాచ్‌లో ధోని చేసింది.. 36 పరుగులు. అజ్మల్ చెప్పినట్లు 18 కాదు. ఇది ఒకటో తప్పు. అలాగే, ధోని రెండు క్యాచులు ద్రోప చేశాడన్నది మరో అబద్ధం. కేవలం ఒక క్యాచ్‌ను మాత్రమే జారవిడుస్తాడు.