
పాకిస్తాన్ మైనార్టీలు ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు వ్యతిరేకంగా ఆందోళన చేశారు. పాకిస్తాన్లో మైనార్టీలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ న్యూయార్క్లోని యూఎన్ ఆఫీస్ దగ్గర్లో ప్రొటెస్ట్ చేశారు. ‘యూఎస్ బేస్డ్ అడ్వొకసీ గ్రూప్’, ‘వాయిస్ ఆఫ్ కరాచీ’ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. “ పాకిస్తాన్ మానవహక్కులను ఉల్లంఘించే దేశం”, “ పాకిస్తాన్లో యూఎన్ జోక్యం చేసుకోవాలని మొహజీర్లు డిమాండ్ చేస్తున్నారు” అంటూ ట్యాక్సీలు, ట్రక్కులపై ప్రకటనలను డిస్ప్లే చేశారు. మొహజీర్లు శాంతియుతంగా ఆందోళన చేసేందుకు కూడా పాక్ అనుమతించదని, అందుకే యూఎన్ సాయం కోరుతున్నామని కరాచీ మాజీ మేయర్ వాసేజలీల్ చెప్పారు. “మొహజీర్లపై వందల ఏళ్ల నుంచి దాడులు జరుగుతూనే ఉన్నాయి. 25 వేల మంది చనిపోయారు. చాలా మంది కనిపించకుండా పోయారు. మా పరిస్థితిని ప్రపంచానికి తెలియజేయాలనే ఆందోళన చేస్తున్నాం” అని చెప్పారు. సొంత దేశంలోని మైనార్టీల గురించి పట్టించుకోని ఇమ్రాన్ యూఎన్ వేదికగా కాశ్మీర్ అంశంపై మాట్లాడటం దురదృష్టకరమని వాయిస్ ఆఫ్ కరాచీ చైర్మన్ నుస్రత్ అన్నారు. జాతి, మతపరమైన మైనార్టీలను గౌరవంగా చూడాలని అన్నారు. ఇమ్రాన్ ఖాన్ ముందు తన దేశంలోని ప్రజల సమస్యలు పరిష్కరించిన తర్వాత మిగతా వారి గురించి ఆలోచించాలని హితవు పలికారు. “ ముస్లింలకు ఇండియా వ్యతిరేకమని పాక్ ఆరోపించడం సిగ్గుచేటు. పాకిస్తాన్లో మతపరమైన మైనార్టీలకు నరకం చూపించారు. పాక్ కాశ్మీర్ అంశం గురించి మాట్లాడే ముందు.. ఇప్పటికీ బంగ్లాదేశ్లోని రెడ్క్రాస్ క్యాంప్స్లో ఉంటున్న పాకిస్తానీ ముస్లింల గురించి చెప్పాలి” అని నుస్రత్ చెప్పారు.