
న్యూఢిల్లీ: ఆసియా కప్ 2025 విజేతగా టీమిండియా నిలిచిన విషయం తెలిసిందే. ఫైనల్లో దాయాది పాకిస్తాన్ను మట్టికరిపించి ఆసియా కప్ విన్నర్గా భారత్ అవతరించింది. తద్వారా 9వ సారి ఆసియా కప్ టైటిల్ను ముద్దాడింది భారత్. ఈ మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ కీలక ప్రకటన చేశారు.
తన ఆసియా కప్ మ్యాచ్ ఫీజు మొత్తం పహల్గామ్ దాడి బాధితుల కుటుంబాలకు, భారత సాయుధ దళాలకు విరాళంగా ఇస్తానని ప్రకటించాడు. ఇదిలా ఉండగా.. టోర్నీలో భారత్పై మూడు మ్యాచుల్లో ఓటమి పాలై సొంత దేశం నుంచే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ను కాపీ కొట్టి మరోసారి విమర్శల పాలయ్యాడు.
భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ వల్ల ప్రభావితమైన పాక్ పౌరులు, పిల్లలకు తమ జట్టు మొత్తం మ్యాచ్ ఫీజును విరాళంగా ఇవ్వనున్నట్లు అఘా ప్రకటించాడు. దీంతో సూర్య కుమార్ యాదవ్ను కాపీ కొట్టాడంటూ సోషల్ మీడియాలో ఘోరంగా ట్రోలింగ్కు గురవుతున్నాడు పాక్ కెప్టెన్.
ఇండియాపై ఎలాగూ గెలవలేరు.. కనీసం ఇలాంటి విషయాల్లోనైనా మీకంటూ సొంత ఆలోచనలు ఉండవా.. ఇది కూడా పక్క జట్టు కెప్టెన్ను చూసి కాపీ కొడతారా.. కాపీ క్యాట్ అంటూ సల్మాన్ను చెడుగుడు ఆడుకుంటున్నారు నెటిజన్లు. మరికొందరు ఇండియన్స్ సల్మాన్ కామెంట్స్కు కౌంటర్ ఇస్తున్నారు.
ఆపరేషన్ సిందూర్లో ఇండియా పాక్ పౌరులపై దాడి చేయలేదని.. కేవలం ఉగ్రవాదుల స్థావరాలపై మాత్రమే ఎటాక్ చేసిందని.. పాక్ కెప్టెన్ ముందు ఈ విషయం తెలుసుకోవాలని చురకలంటిస్తున్నారు. ఈ టోర్నీ ఆసాంతం ఇండియా, పాక్ మ్యాచులు కాంట్రవర్శీలకు కేరాఫ్ గా మారిన విషయం తెలిసిందే. నో షేక్ హ్యాండ్ వివాదం కుదిపేసింది.