
- చైనా సాయంతో సీక్రెట్గా తయారు చేస్తున్న పాకిస్తాన్
- అమెరికా నిఘా వర్గాల వెల్లడి
- టెక్నాలజీ, ఆయుధాలు అందిస్తున్న బీజింగ్
- డిఫెన్స్ను బలోపేతం చేసుకునే ప్లాన్లో పాక్
న్యూఢిల్లీ: పాకిస్తాన్ రహస్యంగా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణ (ఐసీబీఎం) తయారు చేసుకుంటున్నదని అమెరికా నిఘా వర్గాలు వెల్లడించాయి. 5,500 కిలోమీటర్ల కన్నా ఎక్కువ దూరం ప్రయాణించే సామర్థ్యం ఉన్న ఐసీబీఎంని పాక్ అభివృద్ధి చేసుకుంటున్నదని వాషింగ్టన్లోని ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు తెలిపినట్లు అమెరికాకు చెందిన ఫారిన్ మేగజీన్ పేర్కొంది. ఈ మేరకు ఆ మేగజీన్ ఒక కథనాన్ని ప్రచురించింది. అమెరికాను సైతం చేరుకునే సామర్థ్యం ఉన్న ఐసీఎంబీని పాక్ డెవలప్ చేస్తోందని యూఎస్ అధికారులు చెప్పినట్లు తెలిపింది.
ఈ మిసైల్ తయారీ కోసం పాక్కు చైనా సాయం అందిస్తున్నదని వెల్లడించింది. క్షిపణి తయారీకి కావాల్సిన ఆయుధాలు, టెక్నాలజీని సమకూరుస్తున్నదని తెలిపింది. ఒకవేళ ఈ మిసైల్ తయారీ విజయవంతమైతే పాకిస్తాన్ ను అమెరికా ‘అణ్వాయుధ శత్రువు’ గా గుర్తించే అవకాశం ఉంది. తనకు ముప్పుగా లేదా ప్రత్యర్థిగా ఉన్న ఏ దేశం వద్ద అయినా అణ్వాయుధాలు ఉంటే, ఆ దేశాన్ని అమెరికా తన అణ్వాయుధ శత్రువుగా గుర్తిస్తుంది.
‘‘పాకిస్తాన్ ఐసీబీఎంను పొందితే, కచ్చితంగా ఆ దేశాన్ని మా ప్రత్యర్థిగా చూస్తాం. అమెరికాను టార్గెట్ చేసుకునే ఐసీబీఎం ఉన్న ఏ దేశం కూడా మాకు మిత్రుడుకాదు” అని అమెరికా అధికారులు పేర్కొన్నారని ఫారిన్ మేగజీన్ తెలిపింది. ప్రస్తుతం రష్యా, చైనా, ఉత్తర కొరియా వద్ద ఐసీబీఎంలు ఉన్నాయి. వాటిని అమెరికా తన ప్రత్యర్థిగా చూస్తున్నది.
డిఫెన్స్ ను బలోపేతం చేసుకునే ప్లాన్లో పాక్
పహల్గాం టెర్రర్ దాడికి ప్రతీకారంగా భారత్ నిర్వహించిన ‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో తన డిఫెన్స్ వ్యవస్థను పాకిస్తాన్ బలోపేతం చేసుకుంటున్నట్లు తెలిసింది. భారత్ను అడ్డుకునేందుకే తమ అణ్వాయుధాల కార్యక్రమం అని కూడా ఇదివరకే పాక్ చాలాసార్లు స్పష్టంచేసింది. ఇక ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించగల మీడియం రేంజ్ బాలిస్టిక్ క్షిపణి షహీన్ 3ని పాక్ 2022లో పరీక్షించింది. ఆ మిసైల్ సామర్థ్యం 2,700 కిలోమీటర్లు. భారత్లోని చాలా నగరాలు తన పరిధిలోకి వచ్చేలా పాక్ ఆ మిసైల్ను పరీక్షించినట్లు సమాచారం.