న్యూయార్క్: హెచ్1-బీ వీసాపై అమెరికాలో పనిచేస్తున్న పాకిస్తానీ డాక్టర్కు 18 ఏండ్ల జైలు శిక్ష పడింది. టెర్రర్గ్రూపు ఐఎస్ లో చేరేందుకు, అలాగే అమెరికాలో దాడులు చేసేందుకు ప్రయత్నించినందుకు 31 ఏండ్ల ముహమ్మద్ మసూద్కు శుక్రవారం అక్కడి కోర్టు జైలు శిక్ష విధించింది.
మసూద్ పాకిస్తాన్లో డాక్టర్. గతంలో హెచ్-1బీ వీసాపై మిన్నెసోటాలోని మెడికల్ క్లినిక్లో రీసెర్చ్ కో ఆర్డినేటర్గా పనిచేశాడు. 2020 ఏడాది జనవరి, మార్చి మధ్య అతడు సిరియాకు వెళ్లి టెర్రరిస్ట్ గ్రూపులో చేరడానికి ప్రయత్నించాడు. అలాగే, అమెరికాలో ఉగ్రవాద దాడులు నిర్వహించాలని ఉందని చెప్పాడు. ఫిబ్రవరి 2020లో సిరియాకు వెళ్లాలని టికెట్ కూడా కొనుగోలు చేశాడు. కరోనా కారణంగా జోర్డాన్ బార్డర్ మూతపడడంతో వెళ్లలేకపోయాడు. ఈ క్రమంలోనే మినియాపొలిస్- సెయింట్ పాల్ ఇంటర్నేషనల్ఎయిర్పోర్ట్లో మసూద్ పట్టుబడ్డాడు.