చిత్తూరు : ఈ నెల (సెప్టెంబర్)14న పలమనేరు జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన టీటీడీ ఉద్యోగి విష్ణు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం మరణించాడు. తిరుపతికి చెందిన విష్ణు గత శనివారం తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో బెంగళూరుకు వెళ్తుండగా అదుపుతప్పి ప్రమాదం జరిగింది. కారు రోడ్డుకు ఎడమ వైపు రెయిలింగ్ను ఢీకొని వంద మీటర్ల దూరంలో ఎగిరిపడడంతో క్షణాల్లో ఇంజన్ లో మంటలు చెలరేగి పెట్రోల్ ట్యాంకుకు నిప్పంటుకుంది.
ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న విష్ణు భార్య జాహ్నవి (35), కుమారుడు పవన్రామ్ (13), కుమార్తె అస్త్రిత (10), విష్ణు సోదరి కళ (42), ఆమె కుమారుడు భానుతేజ (19) అక్కడే సజీవ దహనమయ్యారు. సగం కాలిపోయి ఆర్తనాదాలు చేస్తున్న విష్ణును సమీపంలో పొలం పనులు చేసుకుంటున్న రైతులు రక్షించి 108లో పలమనేరు ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం వేలూరు సీఎంసీకి రిఫర్ చేశారు. చికిత్స పొందుతూ విష్ణు మృతి చెందారు. తన సోదరిని బెంగళూరులో దింపేందుకు విష్ణు కుటుంబ సభ్యులతో కలసి వెళ్తుండగా పలమనేరు నియోజవర్గ పరిధిలోని టీటీడీ గోశాల వద్ద ఈ ప్రమాదం జరిగింది.