- కృష్ణా బోర్డుకు ‘పాలమూరు’ డీపీఆర్
- రాష్ట్ర సర్కార్ అందజేత
- వీలైనంత త్వరగా ప్రాజెక్టుకు పర్మిషన్ ఇవ్వాలని విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు: కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఈఆర్ఎంబీ)కు పాలమూరు, రంగారెడ్డి లిఫ్ట్ స్కీం డీపీఆర్ను రాష్ట్ర సర్కార్ అందజేసింది. ఇప్పటికే సీడబ్ల్యూసీకి డీపీఆర్ సబ్మిట్ చేసిన ఇరిగేషన్ డిపార్ట్మెంట్.. తాజాగా కేఆర్ఎంబీకి ఇచ్చింది. రూ.55,086.57 కోట్లతో ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నామని తెలిపింది. శ్రీశైలం ఫోర్షోర్లోని ఎల్లూరు నుంచి రోజుకు 1.50 టీఎంసీల చొప్పున 60 రోజుల్లో 90 టీఎంసీలు ఎత్తిపోస్తామని వివరించింది. మైనర్ ఇరిగేషన్లో 45 టీఎంసీలతో పాటు పోలవరం నుంచి కృష్ణా డెల్టాకు మళ్లించే గోదావరి జలాలు 80 టీఎంసీల్లో తెలంగాణ వాటాగా వచ్చే మరో 45 టీఎంసీలను ఈ ప్రాజెక్టుకు కేటాయించామని రాష్ట్ర ఇరిగేషన్ అధికారులు తెలిపారు. ప్రాజెక్టు కోసం 28,273.94 ఎకరాల భూమి సేకరించాల్సి ఉండగా, ఆ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. ప్రాజెక్టు రిజర్వాయర్లు, పంపుహౌస్లు, కాల్వలు, ఇతర పనులతో 5,284 కుటుంబాలు నిర్వాసితులు అవుతున్నారని వివరించారు. డీపీఆర్ పరిశీలన ప్రక్రియ వీలైనంత త్వరగా పూర్తిచేసి అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.