పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి పేరు పెడతామని ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. హైదరాబాద్కు ఆయన వల్లే మెట్రో వచ్చిందన్నారు. మంగళవారం జైపాల్ రెడ్డి 82వ జయంతి వేడుకలను కాంగ్రెస్ సర్కారు అధికారికంగా నిర్వహించింది. స్ఫూర్తి స్థల్ వద్ద మంత్రి కోమటిరెడ్డితో పాటు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, పలువురు ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి వెంకట్రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటు కోసం మలిదశ ఉద్యమంలో జైపాల్ రెడ్డి ఎంతో కృషి చేశారని అన్నారు.
ఆయన ఆకాక్షించిన తెలంగాణను నిర్మిస్తామని చెప్పారు. జైపాల్ రెడ్డి పాటించిన నైతిక విలువలు భావి తరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. దేశంలోని ఐదుగురు ఉత్తమ పార్లమెంటేరియన్లలో జైపాల్ రెడ్డి ఒకరని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొనియాడారు. ఉత్తమ పార్లమెంటేరియన్గా జైపాల్ రెడ్డికి మంచి గుర్తింపు ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. గాంధీభవన్లోనూ జైపాల్ రెడ్డి జయంతి వేడుకలను నిర్వహించారు. పలువురు సీనియర్ నాయకులు జైపాల్ రెడ్డికి నివాళులు అర్పించారు. మాజీ మంత్రులు జానా రెడ్డి, చిన్నా రెడ్డి, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ తదితరులు పాల్గొన్నారు.
ఢిల్లీలోని తెలంగాణ భవన్లో..
దేశ రాజధాని ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి 82వ జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. మంగళవారం అంబేద్కర్ ఆడిటోరియంలో జరిగిన ఈ వేడుకల్లో భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్, ఓఎస్టీ సంజయ్ జాజు, కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ ఉపాధ్యక్షుడు ధరమ్ పాల్ మోరియా, అఖిల భారత యువ సమతా మాజీ అధ్యక్షుడు హుస్సేన్ వాహీద్, కాపిటల్ ఫౌండేషన్ సొసైటీ సెక్రటరీ జనరల్ డాక్టర్ వినోద సేఠీ, ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ ట్రస్టీ సుహస్ బోర్కర్, జైపాల్ రెడ్డి ఫౌండేషన్ సభ్యులు, పలువురు అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా జైపాల్ రెడ్డి చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు. భారత రాజకీయాల్లో అధ్యయనం, అవగాహన, వాక్పటిమల మేళవింపుగా రాణించిన అరుదైన రాజకీయవేత్త జైపాల్ రెడ్డి అని గౌరవ్ ఉప్పల్ అన్నారు.
తెలంగాణ ఏర్పాటుపై చర్చించే వాళ్లం : వివేక్ వెంకటస్వామి
జైపాల్ రెడ్డి జీవితాంతం నీతి, నిజాయతీగల రాజకీయ నాయకుడిగా కొనసాగారని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. తన తండ్రి వెంకటస్వామితో జైపాల్ రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉండేవన్నారు. ఇద్దరు కలిసి అనేక ఉద్యమాలు చేశారన్నారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు ఆయన ఇంటికి వెళ్లి.. తెలంగాణ ఏర్పాటు గురించి చర్చించే వాళ్లమని గుర్తుచేశారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పెట్టడంలో ఆయన కృషి మరువలేనిదన్నారు. నాటి స్పీకర్ మీరా కుమార్ను కలిసి వాయిస్ ఓటుతో పార్లమెంట్ బిల్లు పెట్టొచ్చని సూచనలు చేశారన్నారు. రాష్ట్రం వచ్చాక కేసీఆర్ ఓ పెద్ద రాజకీయ నాటకమాడారని, తానే లేకుంటే రాష్ట్రం సాధ్యమయ్యేది కాదన్నట్టు మాట్లాడారని వివేక్ మండిపడ్డారు. కేంద్ర మంత్రిగా కూడా జైపాల్ రెడ్డి దేశానికి ఎంతో సేవ చేశారన్నారు. జైపాల్ రెడ్డి పేరు చిరస్థాయిగా ఉండేలా సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాలు తీసుకోవాలన్నారు. కాగా, జైపాల్ రెడ్డికి నివాళులర్పించిన వారిలో వివేక్ వెంకటస్వామి తనయుడు వంశీకృష్ణ ఉన్నారు.