- ఊర్లను దత్తత తీసుకోండి
- ప్రజలకు సాయం చేస్తే గుండెల్లో పెట్టుకుంటరు
- సీఎస్ఆర్ ఫండ్స్తో పనులు చేపట్టాలని సూచన
- ప్రజాసేవలో సంతృప్తి పొందేవాళ్లే అసలైన శ్రీమంతులని వ్యాఖ్య
- దత్తతకు అంగీకరించిన పలు ఐటీ కంపెనీలు
హైదరాబాద్ , వెలుగు: ఊర్లను దత్తత తీసుకోవాలని కార్పొరేట్ కంపెనీలకు పంచాయతీ రాజ్ మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. వెనుకబడిన ప్రాంతాలను దత్తత తీసుకొని సీఎస్ఆర్ నిధులు ఖర్చు పెట్టాలన్నారు. కిందిస్థాయిలో అభివృద్ధి కోసం సామాజిక బాధ్యతగా కంపెనీలు ముందుకు రావాలని ఆమె కోరారు. ఒక్కో కార్పొరేట్ కంపెనీ.. ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి పరచాలని సూచించారు.
బుధవారం హైదరాబాద్లోని ప్రజా భవన్లో మంత్రి సీతక్క, సెర్ఫ్ సీఈవో దివ్యా దేవరాజన్, ములుగు కలెక్టర్ దివాకర్ తో మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, క్వాల్కమ్, బోష్, గ్రాన్యుల్స్ ఇండియా, టీసీఎస్, ఉషా, నిర్మాన్ తదితర కంపెనీల ప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ‘‘మనతో పాటు చుట్టూ ఉన్న వాళ్లు సంతోషంగా ఉండాలన్న లక్ష్యంతో కార్పొరేట్ కంపెనీలు పని చేస్తే సమాజం అభివృద్ధి చెందుతుంది.
కార్పొరేట్ కంపెనీలు ఊర్లను దత్తత తీసుకొని స్థానిక సమస్యలను పరిష్కరించడంతో పాటు ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేలా స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలను నిర్వహించాలి” అని పిలుపునిచ్చారు. ఆదిలాబాద్, ములుగు వంటి ప్రాంతాల్లో ఇప్పటికే కార్పొరేట్ కంపెనీలు కొన్ని గ్రామాలను దత్తత తీసుకొని మార్పు చేసి చూపించాయని ఆమె గుర్తుచేశారు. మిగితా ట్రైబల్ ప్రాంతాలైన భద్రాచలం, నాగర్ కర్నూలు ఏరియాల్లోని గ్రామాలను దత్తత తీసుకోవాలని కోరారు.
ప్రజలకు చేయూతనివ్వండి
విద్య, వైద్యం, ఉపాధి, పారిశుధ్య నిర్వహణ, మంచినీరు, మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాల్లో ప్రజలకు చేయూతనిచ్చేలా కంపెనీలు ముందుకు రావాలని మంత్రి సీతక్క సూచించారు. ప్రజలకు సాయం చేస్తే గుండెల్లో పెట్టి చూసుకుంటారని ఆమె తెలిపారు. ప్రజాసేవలో సంతృప్తి పొందినవారే అసలైన శ్రీమంతులని పేర్కొన్నారు. ములుగు జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులను, అవసరాలను, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను కలెక్టర్ దివాకర్ వివరించారు.
మంత్రి పిలుపుమేరకు ములుగు వంటి నియోజకవర్గాల్లో సీఎస్ ఆర్ నిధులను వెచ్చించేందుకు, అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకునేందుకు కంపెనీలు అంగీకరించాయి. ములుగు జిల్లాలోని సమస్యలను కంపెనీల ప్రతినిధులకు కలెక్టర్ వివరించారు. త్వరలో ములుగు జిల్లాల్లో పర్యటిస్తామని కంపెనీల ప్రతినిధులు తెలిపారు. మంత్రిని కలిసిన వాళ్లలో ఇన్ఫోసిస్ నుంచి వంశీ, కాగ్నిజెంట్ నుంచి శివ, మెక్రోసాఫ్ట్ నుంచి రాజ్యలక్ష్మి, తనిష్క, హైసియా ప్రతినిధి నీరజతో పాటు సుమారు 30 మంది ఉన్నారు.
