కొత్త రూల్స్ ఇవే : 7 నుంచి పాపికొండల టూర్​ 

కొత్త రూల్స్ ఇవే : 7 నుంచి పాపికొండల టూర్​ 
  • తర్వాత కూనవరం, వీఆర్‍పురం నుంచి ప్రారంభానికి సన్నాహాలు
  •  పెద్ద బోట్లకే పర్మిషన్‍.. లాంచీలకు నో

భద్రాచలం, వెలుగు: పాపికొండల టూర్​రెండేండ్ల తర్వాత మళ్లీ షురూ అవుతోంది. 2019 సెప్టెంబరు నెలలో ఆంధ్రాలోని తూర్పుగోదావరి జిల్లా కచ్చలూరు వద్ద జరిగిన లాంచీ ప్రమాదంలో 47 మంది జలసమాధి అయ్యారు. నాటి నుంచి పర్యాటక లాంచీలను నిలిపివేశారు. తర్వాత కరోనా కారణంగా పర్యాటకంపై నిషేధం విధించారు. గత సంవత్సరం కేంద్రం పర్యాటక ప్రాంతాలకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో అనేక మార్పులు, చేర్పులతో ఆంధ్రా సర్కారు పాపికొండల పర్యాటక బోట్లకు దశలవారీగా అనుమతులు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా తొలిదశలో ఏపీలోని రాజమండ్రి నుంచి బోట్లకు అనుమతినిచ్చారు. నవంబరు 7న టూర్​ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. విలీన మండలాలైన కూనవరం, వీఆర్‍పురం నుంచి కూడా బోట్లను తిప్పేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అటూ ఇటూ కలిపి మొత్తంగా 80కి పైగా లాంచీలు పాపికొండల మధ్య పర్యాటకులను తిప్పుతున్నాయి. అయితే ఆంధ్రా సర్కారు  తెచ్చిన కొత్త రూల్స్​లో లాంచీలకు అనుమతి నిరాకరించారు. కేవలం పెద్ద బోట్లకే పర్మిషన్‍ ఇచ్చారు. 
సరికొత్త రూల్స్.. 
కచ్చలూరు ప్రమాదం నేపథ్యంలో మరోసారి ఇలా జరగకుండా ఏపీ సర్కారు చర్యలు చేపట్టింది. ముందుగా లాంచీలకు లైసెన్సులు ఇచ్చే అధికారాన్ని నీటిపారుదల శాఖ నుంచి పోర్టు అధికారులకు బదలాయించింది. దీంతో లాంచీల డిజైన్‍పై పోర్టు అధికారులు అనేక ఆంక్షలు పెట్టారు. ప్రమాదం వచ్చిపడినా లాంచీ అడుగు భాగాన ఎట్టి పరిస్థితుల్లో నీరు ప్రవేశించకుండా ఫైబర్‍ నిర్మాణం సూచించారు. అన్ని లాంచీలను రూ.5 లక్షలు వెచ్చించి బోట్లుగా డిజైన్‍ మార్చారు. ఇక బోట్‍యజమానులకు కూడా అవగాహన ఉండాలనే ఉద్దేశంతో బీహార్​లోని పాట్నాలో 30 మందికి ట్రైనింగ్​ఇచ్చి వారం తర్వాత వారికి బోట్‍మెన్‍ అనే సర్టిఫికెట్‍ఇచ్చారు. బోట్లు నడిపే సరంగులు, డ్రైవర్లకు పదో తరగతి విద్యార్హత పెట్టారు. కానీ బ్రిటీషు కాలం నుంచి గోదావరిలో తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలోని డ్రైవర్లు, సరంగులే లాంచీలు నడుపుతున్నారు. వారికి చదువు లేదు. అనుభవం మాత్రమే ఉంది. విద్యార్హత పెట్టడంతో సుమారు 10 మందికి పైగా నిరుద్యోగులు మాత్రమే ఇటీవల తెలంగాణలోని మెదక్‍లో సరంగు, డ్రైవింగ్‍పై శిక్షణ తీసుకున్నారు. 
తనిఖీలు చేశాకే పర్మిషన్
ఈసారి ఇబ్బడిముబ్బడిగా బోట్లకు అనుమతి ఇచ్చే పరిస్థితులు లేవు. కచ్చలూరు ప్రమాద ఘటన తర్వాత తెచ్చిన కొత్త రూల్స్​ ప్రకారం బోట్ కి కచ్చితంగా ఇన్య్సూరెన్స్ చేయించాలి. సుమారు రూ.1.3 లక్షల వరకు ఈ ఇన్య్సూరెన్స్ ఉంటుంది. దీనికి తోడు సీటింగ్‍ పూర్తిగా మార్చేయాలి. వీటికి ఉపయోగించే రేకులు 4 ఎంఎం,6 ఎంఎం అయితేనే అనుమతి ఇస్తారు. బోటులో సురక్షిత పరికరాలు ఉండాలి. లేనివాటికి ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతి ఇవ్వరు. దీంతో ప్రస్తుతం అతి తక్కువ సంఖ్యలోనే బోట్లు తిరిగే అవకాశం ఉంది.
భద్రాద్రికి ఊరట
పాపికొండల పర్యాటకానికి గ్రీన్‍సిగ్నల్‍ రావడంతో భద్రాద్రికి ఊరట లభించింది. పాపికొండల పర్యాటకానికి ఎక్కువ సంఖ్యలో యాత్రికులు వెళ్లేది భద్రాచలం నుంచే. వివిధ రాష్ట్రాలతో పాటు, విదేశీ పర్యాటకులు భద్రాచలం వచ్చి రామయ్య దర్శనం చేసుకుని ఇక్కడే టిక్కెట్లు బుక్‍ చేయించుకుని ఆంధ్రాలో విలీనమైన కూనవరం, వీఆర్‍పురం మండలాలకు వెళ్లి బోట్లలో పాపికొండలు చూసి వస్తారు. రెండేండ్లుగా కరోనాతో పాటు, పాపికొండల పర్యాటకం నిలిచిపోవడంతో దేవస్థానం ఆదాయం పడిపోయింది. భక్తుల రాక కూడా తగ్గింది. ప్రస్తుతం పాపికొండల పర్యాటకం ప్రారంభంతో ఆలయ ఆదాయం పెరుగుతుందని దేవస్థానం అధికారులు భావిస్తున్నారు.