
- మేనిఫెస్టోలోని ప్రతి హామీని నెరవేరుస్తం
- పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి
హైదరాబాద్, వెలుగు : మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి హామీని నెరవేరుస్తామని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర గవర్నర్కు కృతజ్ఞతలు తెలుపుతూ శనివారం అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టగా, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి బలపరిచారు. ఈ సందర్భంగా రామ్మోహన్రెడ్డి మాట్లాడారు. ప్రజా సమస్యలపై గొంతెత్తె అవకాశాన్ని గత ప్రభుత్వం ఇవ్వలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం ప్రజాస్వామికంగా ఉంటుందని తెలిపారు. ఇదే విషయాన్ని సభకు తెలిపిన గవర్నర్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.
ప్రభుత్వం ఏర్పడిన రెండ్రోజుల్లోనే మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించామని చెప్పారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ. పది లక్షలకు పెంచామని పేర్కొన్నారు. కుటుంబంలో ఇద్దరు వృద్ధులు ఉంటే, ఇకపై ఇద్దరికీ పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించామని వెల్లడించారు. వ్యవసాయానికి ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేస్తామని వివరించారు. ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. ఆటో డ్రైవర్లకు ఏడాదికి 12 వేల చొప్పున చెల్లిస్తామన్నారు. రైతులకు క్వింటాల్ కు రూ.500 బోనస్ చెల్లించి కొనుగోలు చేస్తామన్నారు.