- రాజ్యాంగ సవరణ బిల్లు సహా పలు కీలక బిల్లులను ప్రవేశ పెట్టనున్న కేంద్రం
న్యూఢిల్లీ, వెలుగు: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 1 నుంచి 19 వరకు నిర్వహించనున్నట్లు పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. వింటర్ సెషన్ కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు.
ఈ మేరకు శనివారం సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా కిరణ్ రిజిజు పేర్కొన్నారు. ‘భారత ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశలో, ప్రజల ఆకాంక్షలకు ఉపయోగపడే నిర్మాణాత్మక అర్థవంతమైన సమావేశాల కోసం ఎదురు చూస్తున్నా’ అని పోస్ట్ చేశారు. కాగా.. మొత్తం 19 రోజులు సాగే ఈ సమావేశాల్లో 15 రోజులు ఉభయ సభలు భేటీ కానున్నాయి.
అలాగే ఈ సెషన్లో కీలక మైన రాజ్యాంగ (130 వ) సవరణ బిల్లు–2025, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వ (సవరణ) బిల్లు, జమ్మూ– కాశ్మీర్ పున: వ్యవస్థీకరణ(సవరణ) బిల్లు, ఇతర బిల్లులను ఉభయ సభల్లో ప్రవేశపెట్టేందుకు కేంద్రం యోచిస్తోంది. గతంలో శీతాకాల సమావేశాలు సాధారణంగా నవంబర్ మూడో వారంలో మొదలై, క్రిస్మస్(డిసెంబర్ 25)కు ముందు ముగిసేవి.
గతేడాది సైతం నవంబర్ 25న ప్రారంభమై డిసెంబర్ 20 కి ముగిసాయి. అయితే, బిహార్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరగనున్న ఈ సమావేశాలు చాలా కీలకం కానున్నాయి. దేశవ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్), హర్యానా, మహారాష్ట్ర లలో జరిగిన ఓట్ల చోరీపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్ష పార్టీ సిద్ధంగా ఉంది.
మోదీ టీమ్కు పార్లమెంట్ ఫోబియా: విపక్షాలు
ప్రధానీ మోదీ టీం కు ‘పార్లమెంట్ ఫోబియా’ పట్టుకుందని టీంఎసీ రాజ్య సభ పార్లమెంటరీ పార్టీ నేత డెరెక్ ఒబ్రాయిన్ విమర్శించారు. ‘మోదీ, ఆయన సహచర మంత్రి బృందం పార్లమెంట్ ఫోబియా అనే తీవ్రమైన మానసిక పరిస్థితితో బాధపడుతున్నారు. ఇది పార్లమెంట్ ను నడపలేని భయం. ఈ నిర్ణయం మోదీ ప్రభుత్వంపై సందేహాలను సృష్టిస్తోంది’ అని అన్నారు.
కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, రాజ్యసభ పార్టీ చీఫ్ విప్ జైరాం రమేశ్ కేంద్ర నిర్ణయాన్ని తప్పుబట్టారు. ‘ఇది అసాధారణమైన నిర్ణయం. ఈ షార్ట్ సెషన్ తో ఏం సందేశం ఇవ్వాలను కుంటున్నారు. కేంద్ర ప్రభుత్వానికి బిల్లులపై సవివరమైన చర్చ, ఆమోదం, సభ సజావుగా నిర్వహించాలనే ఆలోచన లేదు’ అని ఎక్స్లో పోస్ట్ చేశారు.
