ప్రచారంపై ఫోకస్  .. క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు చేసుకుంటున్న పార్టీలు

ప్రచారంపై ఫోకస్  .. క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు చేసుకుంటున్న పార్టీలు

కామారెడ్డి, వెలుగు: అసెంబ్లీ ఎన్నికలు  దగ్గర పడుతుండడంతో పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీల నేతలు పర్యటిస్తున్నారు. బతుకమ్మ, దసరా పండుగలు ముగియడం, పోలింగ్ కు ఐదు వారాలే ఉండడంతో కామారెడ్డి జిల్లాలోని  4 నియోజక వర్గాల్లో ప్రచారం కోసం బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్​ పార్టీలు రెడీ అవుతున్నాయి.  బీఆర్ఎస్  జిల్లాలోని అన్ని నియోజక వర్గాల అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించింది. బీజేపీ కామారెడ్డి, జుక్కల్​ అభ్యర్థులను ప్రకటించగా, కాంగ్రెస్​ పార్టీ ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. ఇప్పటికే ఖరారైన అభ్యర్థులు ప్రచారానికి  ఏర్పాట్లు చేస్తున్నాయి. 

ప్రచారంలో ముందున్న బీఆర్ఎస్..

బీఆర్ఎస్​ పార్టీకి చెందిన అభ్యర్థులు ముందే ఖరారు కావడంతో, వారు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. గ్రామాల్లో  పర్యటిస్తూ ప్రచారం చేస్తున్నారు. కామారెడ్డిలో సీఎం కేసీఆర్​ పోటీ స్తున్న దృష్ట్యా, ఆ పార్టీ ఇక్కడ తమ ప్రోగ్రామ్స్​ స్పీడప్​  చేస్తోంది. ఈ నెల 7న కామారెడ్డిలో జరిగిన మీటింగ్​కు కేటీఆర్​ హాజరయ్యారు. వారం రోజుల కింద హైదరాబాద్​లో మండలాల ముఖ్య నేతలతో మీటింగ్​ నిర్వహించారు. 100 మంది ఓటర్లకు ఒక ఇన్​చార్జీతో పాటు బూత్, గ్రామ,  టౌన్​లలో వార్డుల వారీగా పార్టీ లీడర్లు, కార్యకర్తలకు బాధ్యతలు అప్పగించారు. నియోజకవర్గాలు, మండలాల వారీగా సమన్వయ కమిటీలను ఏర్పాటు చేశారు.

బీజేపీ, కాంగ్రెస్​ పార్టీలకు చెందిన వారిని తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. త్వరలోనే  కేసీఆర్​ కూడా పార్టీ  శ్రేణులతో సమావేశం కానున్నట్లు సమాచారం. ఆ తర్వాత  మండలాల వారీగా మీటింగ్​లు ఏర్పాటు చేస్తున్నారు. వచ్చే నెల 9న  కేసీఆర్​ ఇక్కడ నామినేషన్​ వేసేందుకు ముహూర్తం ఫిక్స్​ అయింది. నామినేషన్​ సందర్భంగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు.  ఈ నెల 30న జుక్కల్, బాన్సువాడ నియోజక వర్గాల్లో జరిగే మీటింగ్​లలో కేసీఆర్​ పాల్గొంటారు. ఇక బాన్సువాడ, జుక్కల్, ఎల్లారెడ్డిల్లో ఆ పార్టీ అభ్యర్థులు పోచారం శ్రీనివాస్​రెడ్డి, హన్మంత్​షిండే, జె సురేందర్​ క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్నారు. 

బీజేపీ ప్రచారం షురూ..

కామారెడ్డి, జుక్కల్​నియోజకవర్గ అభ్యర్థులను బీజేపీ ఫస్ట్​ లిస్టులో ప్రకటించింది.  బాన్సువాడ, ఎల్లారెడ్డి  అభ్యర్థుల ప్రకటన పెండింగ్​లో ఉంది. కామారెడ్డి, జుక్కల్​ నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులు ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించారు. కామారెడ్డిలో కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఇప్పటికే  గ్రామాలు, టౌన్​లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. వివిధ వర్గాల వారితో మీటింగ్​లు నిర్వహించి మద్దతును కూడగట్టుకునే పనిలో ఉన్నారు.

ఇటీవల గ్రామాల వారీగా పర్యటించిన ఆయన చేరికలపై దృష్టి పెట్టారు. అభ్యర్థి ప్రకటనకు ముందే ఆయన ప్రచారం ప్రారంభించారు. ఇక్కడ బీఆర్ఎస్​ నుంచి కేసీఆర్​ పోటీ చేస్తుండడంతో ధీటుగా ఎదుర్కొనేందుకు కమల దళం పక్కా ప్లాన్​తో ముందుకెళ్తోంది. ప్రభుత్వ వైఫల్యాలపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. సోషల్  మీడియాను ఇందుకు వేదికగా వాడుతున్నారు.   త్వరలోనే ఇక్కడ జాతీయ, రాష్ట్ర నేతలు పర్యటిస్తారని బీజేపీ వర్గాలు తెలిపాయి. జుక్కల్​లో పార్టీ జిల్లా అధ్యక్షురాలు, బీజేపీ అభ్యర్థి అరుణతార కొద్ది రోజులుగా నియోజకవర్గంలో కలియ తిరుగుతున్నారు. గ్రామాల్లో పర్యటిస్తూ ఓటర్లను కలుస్తూ ప్రచారం చేస్తున్నారు. 

అభ్యర్థుల ప్రకటన రాకున్నా..

కాంగ్రెస్​ పార్టీ  4 నియోజక వర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది.  కామారెడ్డి నుంచి పోటీ చేయనున్న మాజీ మంత్రి, ఆ పార్టీ ముఖ్య నేత షబ్బీర్​అలీ కొద్ది నెలలుగానియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. గ్రామాల్లో ర్యాలీలు, మీటింగ్​లు నిర్వహించారు.   ఎల్లారెడ్డి టికెట్​ ఆశిస్తున్న మదన్​మోహన్​రావు, సుభాష్​రెడ్డి కూడా ప్రచారం మొదలుపెట్టారు. జుక్కల్​లో మాజీ ఎమ్మెల్యే గంగారాం  క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్నారు. టికెట్​ ఆశిస్తున్న ఎన్ఆర్ఐ లక్ష్మీకాంతరావు కూడా  గ్రామాల్లో తిరుగుతూ స్థానికులు, పార్టీ శ్రేణులను కలుస్తున్నారు. బాన్సువాడలో  స్థానిక లీడర్లు మీటింగ్​లు నిర్వహిస్తున్నారు. అభ్యర్థుల ఖరారు తర్వాత జిల్లాలో కాంగ్రెస్​ పార్టీ ముఖ్య నేతలు ప్రచారానికి రానున్నారు.