మామూలిస్తావా.. షాప్ తీసేస్తావా: ఎమ్మెల్యే కొడుకు బెదిరింపు

మామూలిస్తావా.. షాప్ తీసేస్తావా: ఎమ్మెల్యే కొడుకు బెదిరింపు

చిప్స్ షాప్ ఉంచాలంటే మామూలు ఇవ్వాల్సిందే లేదంటే దుకాణం బంద్ అయితదని బెదిరించిన ఓ ఎమ్మెల్యే కొడుకుపై కేసు నమోదైంది. సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. పఠాన్ చెరులోని పద్మావతి వెంకటేశ్వర వైన్స్ ఎదుట కిరణ్ గౌడ్ అనే వ్యక్తి ఓ చిన్న చిప్స్ షాప్ నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆ షాప్ అక్కడ ఉంచాలంటే మామూలు ఇవ్వాల్సిందేనని పఠాన్ చెరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి, ఆయన అనుచరులు బెదిరిస్తున్నారంటూ అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

షాప్ దగ్గరకు వచ్చి గొడవ చేశారని, ఆ తర్వాత మళ్లీ ఇంటికి వెళ్లి తన భార్య శైలజపై కూడా దౌర్జన్యం చేసి బెదిరించారని చెప్పాడు. దాదాపు 40 మంది యువకులు ఇంటిపైకి వచ్చి దాడికి యత్నించారన్నాడు. భాదితుడి ఫిర్యాదును స్వీకరించిన పటాన్ చెరు పోలీసులు ఎమ్మెల్యే కొడుకుతో పాటు మరికొందరు యువకులపైనా కేసు నమోదు చేశారు. ఐపీసీ 447, 323,506, 509 సెక్షన్ల కింద వారిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పఠాన్ చెరు సీఐ నరేష్ తెలిపారు.