- గ్యాస్ సిలిండర్ల కొరతంటూ పేషెంట్ల అందించే ఫుడ్లో కోత
- భద్రాద్రికొత్తగూడెం జీజీహెచ్లో మెనూకు తిలోదకాలు
- కాంట్రాక్టర్ నిర్లక్ష్యం., అధికారుల పర్యవేక్షణ కరువు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : రోగం నయం చేసుకోవడానికి ఆస్పత్రిలో చేరిన రోగులకు ఇచ్చే ఫుడ్కు కోత పడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో గ్యాస్ సిలెండర్ల కొరత అంటూ పేషెంట్లకు మెనూ ప్రకారం పౌష్టికాహారం ఇవ్వడం లేదు. గ్యాస్ కొరత సాకుతో ఆస్పత్రి క్యాంటిన్ కాంట్రాక్టర్ మెనూతో సంబంధం లేకుండా ఇష్టం వచ్చినట్లు ఇ న్పేషెంట్లకు ఆహారం అందిస్తున్నాడు. ఆస్పత్రి ఆఫీసర్లు, సిబ్బంది పర్యవేక్షణ లేకపోవడం కూడా ఇందుకు కారణం. డైటీషియన్, న్యూట్రీషియన్ పోస్టులు ఖాళీగా ఉండడంతో కాంట్రాక్టర్దే ఇష్టారాజ్యంగా మారింది.
పేషెంట్లకు నామమాత్రపు ఫుడ్..
భద్రాద్రికొత్తగూడెం జీజీహెచ్లో నిత్యం వందలాది రోగులు ఇన్ పేషెంట్లుగా ఉంటూ ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నారు. ఇన్ పేషెంట్లుగా ఉన్న వారికి ఆస్పత్రిలోని క్యాంటీన్ నుంచి ఫుడ్ అందిస్తారు. రోగుల ఆరోగ్య పరిస్థితిని బట్టి వైద్య సిబ్బంది మెనూను కాంట్రాక్టర్కు సూచిస్తారు. ఆ ప్రకారమే రోగులకు ఫుడ్ అందించాల్సి ఉంది. కాగా, సిలిండర్ల కొరతంటూ రెండు, మూడు రోజులుగా కాంట్రాక్టర్ ఫుడ్లో కోత పెట్టారు.
పలువురు రోగులకు కోడి గుడ్డును ఇవ్వడం లేదు. సాంబర్, పప్పు అందివ్వడం లేదు. అన్నం, అరటిపండుతో పాటు నీళ్లవంటి మజ్జిగ, కూర మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. తమ కళ్ల ముందే నామమాత్రపు ఫుడ్ను అందిస్తున్నప్పటికీ వైద్యులు, సిబ్బంది తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తుండడంపై విమర్శలు వస్తున్నాయి.
న్యూట్రీషియన్, డైటీషియన్ పోస్టులు ఖాళీ..
జీజీహెచ్లో న్యూట్రీషియన్తో పాటు డైటీషియన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో ఇన్ పేషెంట్లకు అందించే ఫుడ్క్వాలిటీ, మెనూ అమలు తీరును పర్యవేక్షించే వారే కరవయ్యారు. నర్సింగ్ సూపరింటెండెంట్తో పాటు ఆర్ఎంవో, ఏడీ కనీసం పర్యవేక్షించకపోవడంతో పౌష్టికాహారం రోగులకు అందడం లేదు.
మెనూ అమలు చేయాల్సిందే..
మెనూ ప్రకారం ఇన్ పేషంట్రోగులకు ఫుడ్డును అందించాల్సిన బాధ్యత కాంట్రాక్టర్ దే. గ్యాస్ సిలిండర్లు లేవంటూ ఫుడ్లో కోత పెట్టడం కూడదు. మెనూ పక్కాగా అమలయ్యే విధంగా చర్యలు తీసుకుంటాం. రోగులకు పౌష్టికాహారం అందించే విధంగా కాంట్రాక్టర్ను ఆదేశిస్తాం. -డాక్టర్ రమేశ్, ఆర్ఎంవో, భద్రాద్రికొత్తగూడెం జీజీహెచ్
