
ఖైరతాబాద్, వెలుగు : జనసేన అధినేత పవన్ కల్యాణ్ హైదరాబాద్ లోని ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్కు వచ్చారు. ఎన్నికల ప్రచారం కోసం ఇటీవల తయారు చేయించిన 'వారాహి' వాహనం రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన పవన్.. ఓ బెంజ్ కారుతోపాటు మరికొన్ని వాహనాలకు గురువారం రిజిస్ట్రేషన్ చేయించారు. మొత్తం 6 వాహనాలకు పవన్ కల్యాణ్ రిజిస్ట్రేషన్ చేయించారు. ఇందులో ఒకటి బెంజ్, టయోటా వెల్ఫైర్, 2 స్కార్పియోలు, జీప్, ఒక గూడ్స్ వెహికల్ ఉన్నాయి. ఈ వాహనాలన్నీ ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యాయి. వీటిపై సుమారు రూ.80 లక్షల లైఫ్ ట్యాక్సీ చెల్లించారు.
వారాహి వాహనం రంగుపై అభ్యంతరాలు వ్యక్తం అయిన నేపథ్యంలో...ఖైరతాబాద్ ఆర్టీవో అధికారులు క్లారిటీ ఇచ్చారు. వారాహి వాహనం రంగు విషయంలో నిబంధనలకు వ్యతిరేకంగా పవన్ కల్యాణ్ వ్యవహరించలేదన్నారు. అన్ని రూల్స్కు అనుగుణంగా ఉండటంతో వాహనానికి రిజిస్ట్రేషన్ చేసినట్లు చెప్పారు. వాహన రిజిస్ట్రేషన్లో ఎలాంటి అభ్యంతరాలు లేవని స్పష్టం చేశారు.