కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన.. 10 శాతం కుప్పకూలిన పేటీఎం స్టాక్.. ఏమైంది?

కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన.. 10 శాతం కుప్పకూలిన పేటీఎం స్టాక్.. ఏమైంది?

Paytm Stock: భారతదేశ ఫిన్ టెక్ సేవల రంగంలో పేటీఎం పాత్ర కీలకమైనది. అనేక దేశీయ కంపెనీలకి మునుపే యూపీఐ చెల్లింపుల వ్యవస్థను ప్రజలకు, వ్యాపారులకు అనుసంధానకర్తగా వ్యవహరించింది. 2000 సంవత్సరంలో విజయశేఖర శర్మ దీనిని ప్రారంభించినప్పటికీ ఆ తర్వాత దాని ప్రయాణం అనేక ఒడిదొడుకుల మధ్య కొనసాగింది. చివరిగా భారతీయ రిజర్వు బ్యాంక్ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్సును కూడా రద్దు చేసిన సంగతి తెలిసిందే. 

అయితే నిన్న యూపీఐ చెల్లింపులు రూ.3వేలకు పైబడితే వాటిపై మర్చంట్ డిస్కౌంట్ చార్జీలను కేంద్రం అమలు చేసే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ క్లారిటీ ఇస్తూ తమకు అలాంటి ఆలోచనే లేదని ఎక్స్ ఖాతాలో ప్రకటించింది. దీంతో నేడు పేటీఎం కంపెనీ షేర్లు10 శాతం మేర పతనమైంది. నేడు ఇంట్రాడే ట్రేడింగ్ సమయంలో కంపెనీ షేర్లు ఒక్కోటి రూ.864 స్థాయికి చేరుకుంది. అయితే 11.21 గంటల సమయంలో కంపెనీ షేర్లు ఒక్కోటి రూ.902 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. మరో డిజిటల్ పేమెంట్ కంపెనీ మెుబిక్విక్ స్టాక్ కూడా ఇంట్రాడేలో కేంద్ర ప్రకటన తర్వాత 1 శాతం మేర పతనాన్ని చూసింది. 

వాస్తవానికి క్రెడిట్ లేదా డెబిట్ కార్డుల నుంచి చేసే అన్ని పేమెంట్స్ విషయంలో వ్యాపారుల నుంచి సదరు పేమెంట్ పై 1 శాతం మర్చంట్ డిస్కౌంట్ చార్జీలు వసూలు చేయబడుతున్నాయి. ఈ మెుత్తాన్ని చెల్లింపు సౌకర్యం అందించిన, కార్డు సేవలను అందించిన కంపెనీల మధ్య పంచబడుతుంది. అయితే ప్రస్తుతం యూపీఐ సేవలపై ఎలాంటి ఎండీఆర్ లేనందున దీనిపై ఆలోచించాలని ప్రధాని మోదీకి పేమెంట్ కౌన్సిల్ గతంలో సూచించిన సంగతి తెలిసిందే. ఇదే జరిగితే మళ్లీ ఫిజికల్ డబ్బు వినియోగానికి భారీగా డిమాండ్ పెరిగే అవకాశాలు ఉండటం, అది మళ్లీ బ్లాక్ మనీ, పన్ను ఎగవేతలు వంటి సమస్యలకు కారణంగా మారుతుందనే ఆందోళనల్లో కేంద్ర ప్రభుత్వం ఉందని తెలుస్తోంది.