
కరాచీ: పాకిస్తాన్ వేదికగా సెప్టెంబర్ లో జరిగే ఆసియా కప్ (వన్డే) టోర్నమెంట్లో టీమిండియా పాల్గొనడంపై అనుమానాలు దాదాపు తొలగిపోయినట్టుగా కనిపిస్తోంది. ఈ టోర్నీలో ఇండియా తమ మ్యాచ్లను తటస్థ వేదికపై ఆడేందుకు ఆతిథ్య పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఒప్పుకుంది. ఇండియా మ్యాచ్లు తటస్థ వేదికపై, మిగతా టీమ్స్ పాక్లోనే ఆడేలా పీసీబీ చీఫ్ నజామ్ సేథి ప్రతిపాదించారు. ఆమోదం కోసం దీన్ని ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ)కి పంపినట్టు తెలిపారు. ఇరుదేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఈ టోర్నీ కోసం పాక్ వెళ్లేందుకు బీసీసీఐ నిరాకరించింది. టోర్నీని తటస్థ వేదికకు మార్చాలని డిమాండ్ చేసింది. అయితే, మొత్తం టోర్నీని కాకుండా ఇండియా మ్యాచ్లను మరో చోట నిర్వహించేందుకు పీసీబీ రెడీ అయింది. మధ్యే మార్గంగా ఉన్న ఈ ప్రతిపాదనకు ఏసీసీతో పాటు బీసీసీఐ అంగీకరిస్తే టోర్నీకి మార్గం సుగమం అవుతుంది.