- బీజేపీ, బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందంతో అడ్డంకులు
- కేసీఆర్ హయాంలో కనీవిని ఎరుగని అవినీతి.. కవిత కామెంట్లే ఇందుకు సాక్ష్యం
నిజామాబాద్, వెలుగు: రాష్ట్ర కేబినెట్ విస్తరణ ఎప్పుడు జరిగినా మైనార్టీ నేతకు చోటు లభిస్తుందని పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్గౌడ్తెలిపారు. అసెంబ్లీ ఎలక్షన్స్లో పార్టీ నుంచి మైనార్టీ నేత గెలిచి ఉంటే మొదటి విడతలోనే కేబినెట్అవకాశం ఉండేదని, డిసెంబర్, జనవరిలో ఎప్పుడు విస్తరణ జరిగినా మైనార్టీకి చాన్స్దక్కుతుందన్నారు. గురువారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మహేశ్గౌడ్ పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.
అనంతరం ఆర్అండ్బీ గెస్ట్హౌస్లో మీడియాతో మాట్లాడారు. సామాజిక న్యాయానికి కాంగ్రెస్ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. అమేర్అలీఖాన్ను ఎమ్మెల్సీగా నియమిస్తే.. జీర్ణించుకోలేని బీఆర్ఎస్ కోర్టుకు వెళ్లి అడ్డుకున్నదని, ఆ స్థానాన్ని అజారుద్దీన్తో భర్తీ చేశామన్నారు. రాష్ట్రాన్ని పదేండ్లు పాలించిన కేసీఆర్దండుపాళ్యం బ్యాచ్ అరాచక పాలనను ప్రజలు మరువలేదని, మరో పదేండ్లదాకా మరువరని అన్నారు.
మళ్లీ లేస్తామనే ఆశలు అసలే పెట్టుకోవద్దని బీఆర్ఎస్ నేతలకు సూచించారు. గులాబీ పార్టీని ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడగొట్టి.. పార్లమెంట్ ఎలక్షన్లో సున్నా చేశారని ఎద్దేవా చేశారు. దేశంలో ఇప్పటి వరకు ఎన్నడూ జరగని అవినీతి బీఆర్ఎస్ హయాంలో జరిగిందని, కేసీఆర్కూతురు కవిత కామెంట్లే దానికి బలం చేకూరుస్తున్నాయన్నారు.
కవిత ప్రశ్నలకు కేటీఆర్ ఇప్పటి దాకా జవాబు చెప్పలేదన్నారు. కుటుంబ తగాదాలు తీర్చుకోలేని దైన్యస్థితిలో ఉన్న కేటీఆర్.. రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు సీఎం రేవంత్రెడ్డిని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. ఇకనైనా పసలేని చౌకబారు ఆరోపణలు మానుకోవాలని కేటీఆర్కు హితవు పలికారు. అవినీతి గురించి కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, కవిత మాట్లాడితే.. దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంటుందన్నారు. పదేండ్ల దోపిడీ పాలనలో భాగస్వామిగా ఉన్న కవిత.. ఇప్పుడు పాదయాత్రలు చేస్తే ఎవరు నమ్ముతారని ప్రశ్నించారు.
ఎంపీ అర్వింద్ ఏ లెక్కలతో మాట్లాడారో?
నిజామాబాద్ జిల్లాలో ఆర్వోబీ నిర్మాణలకు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఆగిపోయాయని తాను చేసిన కామెంట్కు కట్టుబడి ఉన్నట్టు మహేశ్కుమార్గౌడ్ తెలిపారు. ఎంపీ అర్వింద్ ఏ లెక్కలతో మాట్లాడారో తనకు తెల్వదని అన్నారు. స్టేట్ వాటా నిధులు ఆగి ఉండొచ్చుకానీ, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్కూడా పెండింగ్లో ఉన్నాయన్నారు. సైటెర్లు వేయడం తనకు కూడా తెలుసన్నారు.
సికింద్రాబాద్నుంచి నిజామాబాద్ మీదుగా -ముంబై వరకు డబుల్ రైల్వే లైన్ కోసం కృషి చేయాలని ఎంపీ అర్వింద్కు సూచించారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్తానని తెలిపారు. హ్యామ్ స్కీమ్ కింద నిజామాబాద్ జిల్లాలో టెంపుల్ కారిడార్ రోడ్ నిర్మాణానికి రూ.380 కోట్లు ఖర్చు చేయబోతున్నామని చెప్పారు. ధర్మపురి, వేములవాడ, రుద్రంగి, మానాల, రాహత్నగర్, మోర్తాడ్, నందిపేట, బాసర దాకా కొత్త రోడ్ నిర్మించబోతున్నట్టు చెప్పారు.
ఇది పూర్తయితే కరీంనగర్–నిజామాబాద్మధ్య దూరం 30 కిలోమీటర్లు తగ్గుతుందన్నారు. లింబాద్రిగుట్టలో రూ.3.50 కోట్లతో గెస్ట్హౌస్ నిర్మాణానికి ఎకరం ఎండోమెంట్ ల్యాండ్ను టూరిజం శాఖకు ట్రాన్స్ఫర్ చేశామని తెలిపారు. కాగా.. పార్టీ ఫిరాయింపులపై కామెంట్ చేస్తున్న కేటీఆర్.. 2014లో జూబ్లీహిల్స్ నుంచి మాగంటి గోపీనాథ్ ఏ పార్టీ నుంచి గెలిచాడో చెప్పాలని గవర్నమెంట్ సలహాదారు షబ్బీర్అలీ ప్రశ్నించారు. టీడీపీ నుంచి గెలిచిన మాగంటిని బీఆర్ఎస్లో కేసీఆర్ చేర్చుకున్నది నిజం కాదా? అని ప్రశ్నించారు.
జూబ్లీహిల్స్లో గెలుస్తం
జూబ్లీహిల్స్లో పేదలు నివసించే కాలనీలే ఎక్కువని, బీఆర్ఎస్ హయాంలో అక్కడ సమస్యలు పేరుకుపోయాయని మహేశ్ గౌడ్ అన్నారు. పదేండ్లలో అభివృద్ధిని పట్టించుకోని బీఆర్ఎస్ను అక్కడి ప్రజలు ఆదరించడం లేదన్నారు. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్యాదవ్ 50 వేల మెజారిటీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ సెగ్మెంట్లో నన్నబియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, ఫ్రీ బస్ స్కీమ్పట్ల ఆదరణ కనిపిస్తున్నదని, సమర్థుడిని పోటీకి దింపడం కలిసొచ్చే అంశమని పేర్కొన్నారు.
