- ఆ రెండు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయనేందుకు ఇదే నిదర్శనం: పీసీసీ చీఫ్ మహేశ్గౌడ్
హైదరాబాద్, వెలుగు: డ్రగ్స్ కేసులో బీఆర్ఎస్ యువ నాయకుడి బ్యాచ్ ఫామ్హౌస్లో దొరికితే.. బీజేపీ నేతలు దీనిపై ఎందుకు స్పందించరని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ప్రశ్నించారు. ఇంతకుముందు పోచంపల్లి ఫాంహౌస్లో కోళ్ల పందేలు జరిగాయని, ఇలాంటి చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు జరుగుతుంటే బీజేపీ నాయకులు ఎందుకు మాట్లాడడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు.
కేవలం ఎన్నికలప్పుడే కాదు..బయట కూడా బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పనిచేస్తున్నాయని దీంతో స్పష్టమవుతున్నదని చెప్పారు. శుక్రవారం గాంధీ భవన్లో మహేశ్కుమార్ గౌడ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా మార్చేందుకు తమ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంటే.. బీఆర్ఎస్ నాయకులు మాత్రం డ్రగ్స్ కేసుల్లో దొరుకుతూ పైగా దబాయించడం ఏంటని మండిపడ్డారు.
డ్రగ్స్ తీసుకుంటూ బీఆర్ఎస్ నేతలు పట్టుబడి వారం గడిచినా.. బీజేపీ నేతలు మౌనంగా ఎందుకున్నారో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. బీసీల గురించి బీజేపీ నాయకులు మాట్లాడితే జనం నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీకి ఎన్నో సేవలు అందించిన బండారు దత్తాత్రేయను ఎందుకు పక్కన పెట్టారో చెప్పాలని కోరారు. ఆయన ఎంపీ సీటును కిషన్రెడ్డి లాక్కున్నారని, పార్టీ అధ్యక్ష పదవిలో ఉన్న మరో బీసీ నేత బండి సంజయ్ సీటును కూడా తీసేసుకున్నారని, వీటిపై బీజేపీ నేతలు జవాబివ్వాలని డిమాండ్ చేశారు.
