వరి వద్దన్నోళ్లే కల్లాల పొంట తిరుగుతున్నరు..బీఆర్ఎస్, బీజేపీ పని అయిపోయింది

వరి వద్దన్నోళ్లే కల్లాల పొంట తిరుగుతున్నరు..బీఆర్ఎస్, బీజేపీ  పని అయిపోయింది
  • పీసీసీ అధ్యక్షుడు మహేశ్​కుమార్ గౌడ్​​

 కామారెడ్డి, వెలుగు : వరి పంట వేయకండి.. కొనే పరిస్థితి లేదన్న బీజేపీ.. వరి వేస్తే ఉరి అన్న బీఆర్ఎస్​ ఇప్పుడు కూడబలుక్కొని కల్లాల పొంట తిరుగుతున్నారని పీసీసీ చీఫ్  మహేశ్​ కుమార్​ గౌడ్  విమర్శించారు. మంగళవారం కామారెడ్డిలో డీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. 

కేంద్రం కేవలం 52 లక్షల మెట్రిక్​ టన్నుల వడ్లు మాత్రమే కొంటుందని, కానీ, తమ ప్రభుత్వం ఇప్పటికే 51 లక్షల మెట్రిక్  టన్నులు కొన్నదని వివరించారు. రైతులకు ఇబ్బంది కలగకుండా 75 లక్షల మెట్రిక్​ టన్నులు కొనాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. 

రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీ పని అయిపోయిందని, ఎవరెన్ని చెప్పినా మళ్లీ కాంగ్రెస్​ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పదేండ్ల బీఆర్ఎస్.. రెండున్నరేండ్ల కాంగ్రెస్​ పాలనను బేరీజు వేసుకుంటున్న ప్రజలు పంచాయతీ, మున్సిపల్​ఎన్నికల్లో తమకే పట్టం కట్టారని చెప్పారు. ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాలో 9 అసెంబ్లీ సీట్లతో పాటు 2 ఎంపీ సీట్లు గెలిచేలా కృషి చేయాలన్నారు. తనకు వ్యతిరేకంగా వస్తున్న వార్తలపై ఇదివరకే వివరణ ఇచ్చానని, అది ముగిసిన అధ్యాయమని పీసీసీ చీఫ్​ తెలిపారు. 

మీడియా అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ పత్రికలకు స్వేచ్చ ఉందని కామెంట్​ చేశారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​ అలీ, ఎమ్మెల్యేలు మదన్మోహన్​రావు, తోట లక్ష్మీకాంతరావు, డీసీసీ ప్రెసిడెంట్​ మల్లిఖార్జున్​, పీసీసీ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్​రెడ్డి, మాజీ ఎమ్మెల్యే యూసుఫ్​అలీ, మున్సిపల్​ చైర్​పర్సన్​ ఉమారాణి పాల్గొన్నారు.