హైదరాబాద్, వెలుగు: నాంపల్లి అగ్నిప్రమాద ఘటనపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం వారు ఓ ప్రకటనను విడుదల చేశారు. అగ్ని ప్రమాదాలకు హైదరాబాద్ నిలయంగా మారిందని రేవంత్ ఆరోపించారు. ప్రమాదాలు వరుసగా జరుగుతున్నా ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టడంలో విఫలమైందని పైర్ అయ్యారు. నాంపల్లిలోని అపార్ట్మెంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 9 మంది చనిపోవడం విచారకరమన్నారు.
అపార్ట్మెంట్సెల్లార్లో కారు రిపేర్లు చేయడమేంటని ఆయన ప్రశ్నించారు. నివాస ప్రాంతంలో కెమికల్ డ్రమ్ములను ఎలా నిల్వ చేశారని నిలదీశారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని డిఓమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు రేవంత్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అగ్ని ప్రమాదంలో 9 మంది చనిపోవడం తీవ్రంగా కలచివేసిందని భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన ఆయన.. వారిని అన్ని విధాలుగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలన్నారు. నాంపల్లి అగ్ని ప్రమాద ఘటనను పరిశీలించేందుకు వెళ్లిన కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ను ఎంఐఎం కార్యకర్తలు అడ్డుకోవడం దారుణమని భట్టి పేర్కొన్నారు.