- టికెట్లపై ఎవరికీ హామీ ఇస్తలేం: రేవంత్ రెడ్డి
న్యూఢిల్లీ, వెలుగు: త్వరలో వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. నేతల చేరికలపై హైకమాండ్ నుంచి స్పష్టత తీసుకుంటున్నట్లు చెప్పారు. అయితే, ఎవరు చేరినా టికెట్లపై ఎలాంటి హామీ ఇవ్వడంలేదన్నారు. ఎన్నికల సమయంలో సీట్ల కేటాయింపుపై పార్టీ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ‘గెలుపు అంశాన్నే కాకుండా పార్టీపట్ల నేతలకు ఉన్న నిబద్ధతను పరిగణలోకి తీసుకొని అభ్యర్థులను పార్టీ నిర్ణయిస్తుంది. దీనిపై పార్టీకి ఒక విధానం ఉంది. పార్టీలో చేరబోయే వారికి ఈ విషయంలో స్పష్టత ఇవ్వాలని భావిస్తున్నాం’ అని చెప్పారు. మంగళవారం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ (సంస్థాగత) కేసీ వేణుగోపాల్తో రాష్ట్ర ఇంచార్జ్ మాణిక్కం ఠాకూర్, చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క భేటీ అయ్యారు.
ప్రతిపక్షాలను చీల్చేందుకే బీఆర్ఎస్
భేటీ తర్వాత రేవంత్ మాట్లాడుతూ మోడీకి మద్దతుగా ప్రతిపక్ష పార్టీలను చీల్చేందుకే కేసీఆర్ బీఆర్ఎస్ ను తెరపైకి తెచ్చారనిఆరోపించారు. మోడీకి ఉపయోగపడుతుంది అంటేనే, కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ప్రతిపాదన ముందుకు తీసుకెళ్తారన్నారు. కేసీఆర్ ఏ ఫ్రంట్ పెట్టడని గతంలో తాను చెప్పిందే నిజమైందని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పరిస్థితి కూడా అట్లనే ఉంటదన్నారు. మోడీ జెండా, అజెండాను కేసీఆర్ అమలు చేస్తున్నరని ఆరోపించారు. మోడీ అనుకూలంగా టీఆర్ఎస్ అనుసరిస్తున్న విధానాలను ప్రజలకు వివరిస్తామన్నారు. వెస్ట్ బెంగాల్ లో బీజేపీ అనుసరించిన వ్యూహాన్నే ప్రశాంత్ కిశోర్ తెలంగాణలో అమలు చేస్తున్నాడని చెప్పారు. పీకే వ్యూహాన్ని తిప్పికొడతామని చెప్పారు. బీజేపీ, టీఆర్ఎస్ లతో పోరాడడమే కాంగ్రెస్ ముందున్న కార్యాచరణ అని స్పష్టం చేశారు. అలాగే తాను పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టి జులై 7వ తేదికి ఏడాది పూర్తి కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున చేరికలకు ఏర్పాట్లు చేశామన్నారు. పార్టీ బలోపేతం దిశలో తన ఆధ్వర్యంలో ఏడాదిలో చేపట్టిన దళిత గిరిజన దండోరా, నిరుద్యోగ గర్జన, రైతు డిక్లరేషన్లను పార్టీ జనరల్ సెక్రటరీకి వివరించామన్నారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి సూచనలు, సలహాలు తీసుకున్నట్లు తెలిపారు. త్వరలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్న నేతల వివరాలు అందించినట్లు చెప్పారు. పీసీసీ అధ్యక్షుడి అనుమతితోనే విష్ణువర్ధన్ రెడ్డి తన ఇంట్లో మీటింగ్ పెట్టారని క్లారిటీ ఇచ్చారు. ఢిల్లీలో ఉండడంవల్ల తాము హాజరుకాలేదన్నారు.
బీజేపీ, టీఆర్ఎస్కు సవాల్
దళిత గిరిజన డిక్లరేషన్, విద్యార్థి డిక్లరేషన్ విషయంలో త్వరలో కార్యాచరణ తీసుకోనున్నట్లు రేవంత్ తెలిపారు. ఇందుకోసం రాహుల్ గాంధీ రాష్ట్రంలో పర్యటిస్తారని చెప్పారు. పరేడ్ గ్రౌండ్లో బీజేపీ బల ప్రదర్శన చేసిందని, ఇప్పుడు టీఆర్ఎస్ బలప్రదర్శన చేయాలని సవాల్ విసిరారు. తర్వాత కాంగ్రెస్ మీటింగ్ పెట్టి తెలంగాణ ప్రజలు ఎవరితో ఉన్నారో క్లారిటీ ఇస్తామన్నారు.
టీఆర్ఎస్, బీజేపీ కలిసి నాటకాలాడుతున్నయ్: భట్టి
‘‘కాంగ్రెస్ పార్టీ చాలా పెద్దది. అనేక అంశాలపై నేతల్లో భిన్నాభిప్రాయాలు ఉంటాయి. అయితే వాటిని భేదాభిప్రాయాలుగా భావించద్దు” అని భట్టి అన్నారు. వరంగల్ లో కాంగ్రెస్ బల ప్రదర్శన చూసాకే... బీజేపీ హైదరాబాద్ లో బల ప్రదర్శనకు వచ్చిందన్నారు. కానీ, ప్రధాని మోడీ పసలేని ప్రసంగం చేశాని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కూడా రాష్ట్రానికి రావాల్సిన అంశాలపై నిలదీయలేదన్నారు. రెండు పార్టీలు కలిసి నాటకాలు ఆడుతున్నాయని మండిపడ్డారు. వాళ్లిద్దరి డ్రామాలు ప్రజలకు అర్థమయ్యేలా కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ ప్రణాళికను చేపడుతుందన్నారు. టీఆర్ఎస్ పాలనతో విసిగి వేసారిపోయిన చాలా మంది నేతలు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ భావజాలం ఉన్నవారందరిని దశల వారీగా చేర్చుకోనున్నట్లు తెలిపారు. చేరికల తేదీలు, ఎక్కడ చేర్చుకోవాలి అనే అంశాలపై కేసీ వేణుగోపాల్తో చర్చించినట్లు చెప్పారు.