
హైదరాబాద్, వెలుగు : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిగజారుడు రాజకీయాలు బంజేయకపోతే, లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీకి ఒక్క సీటు కూడా రాదని పీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ హెచ్చరించారు. 32 మెడికల్ కాలేజీలకు బదులు, 32 యూట్యూబ్ చానెళ్లు పెడితే బీఆర్ఎస్ గెలిచేది అని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై నిరంజన్ మండిపడ్డారు. ప్రజలకు ఆ మాత్రం అవగాహన లేదా అని ఆయన ప్రశ్నించారు.
సోమవారం గాంధీ భవన్లో నిరంజన్ మీడియాతో మాట్లాడారు. ప్రజల నిర్ణయాన్ని అవమానించే విధంగా మాట్లాడిన కేటీఆర్, వెంటనే వారికీ బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలు కేటీఆర్ అహంకారానికి నిదర్శనమని అన్నారు. ఓటమిని జీర్ణించుకోలేక కేటీఆర్, హరీశ్రావు ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ కొంచెం జాగ్రత్త వహించి ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు15 సీట్లు కూడా రాకపోయేవని నిరంజన్ వ్యాఖ్యానించారు.