
- అధికారులకు పీసీసీఎఫ్ సువర్ణ సూచన
హైదరాబాద్, వెలుగు: కేబీఆర్ పార్కులోకి ప్లాస్టిక్ కవర్లు, వస్తువులను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించకూడదని, అవగాహన కోసం బోర్డులను ఏర్పాటు చేయాలని అటవీ దళాల ప్రధాన సంరక్షణాధికారి(పీసీసీఎఫ్ హెచ్ఓఎఫ్ఎఫ్) డా. సువర్ణ అధికారులకు సూచించారు. బయట నుంచి తెచ్చిన ఆహార పదార్థాలను నెమళ్లు, పావురాలకు పెట్టొద్దని తెలిపారు.
ఆదివారం ఉదయం కాసు బ్రహ్మానందరెడ్డి పార్కును ఆమె సందర్శించారు. వాకర్స్ అసోసియేషన్తో కలిసి పార్కులో తిరిగారు. పార్కులో నెలకొన్న సమస్యలు, కల్పించాల్సిన వసతులపై ఆరా తీశారు. అక్కడక్కడ ఆగి వాకర్స్ తో ముచ్చటించారు. వాకింగ్ ట్రాక్ మెయింటెనెన్స్ బాగుందని, గతంలో కంటే ప్రస్తుతం కేబీఆర్ పార్క్ నిర్వహణ మెరుగుపడిందని వాకర్స్ పేర్కొన్నారు.
టాయిలెట్స్, మంచి నీటి సదుపాయాల కల్పన పరిశుభ్రత విషయంలో అటవీ శాఖ అధికారులకు వారు అభినందనలు తెలిపారు. వర్షాకాలంలో వచ్చే సమస్యలను పీసీసీఎఫ్కు వివరించారు. అక్కడక్కడ రెయిన్ షెడ్లను ఏర్పాటు చేయాలని కోరారు. దీనికి స్పందించిన పీసీసీఎఫ్ జాతీయ పార్కుల్లో నిర్మాణ పనులు చేపట్టాలంటే నిబంధనలు ఉంటాయని, వాటికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
కుక్కల బెడద ఎక్కువగా ఉందన్న విషయంపై జీహెచ్ఎంసీ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ఈ పార్క్ ను పరిశుభ్రంగాఉంచాల్సిన బాధ్యత అందరిపై ఉందని వివరించారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్ వో, ఇతర అటవీశాఖల అధికారులు, వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.