హైదరాబాద్, వెలుగు: బెల్టు షాపులు వద్దని ఉద్యమం చేసినందుకు మహిళలపై పీడీ కేసులు పెట్టి వేధిస్తారా అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. చెన్నూరులో బెల్టు షాపులు, అక్రమంగా నిర్వహిస్తున్న మద్యం షాపులు విపరీతంగా ఉన్నాయన్నారు. ఎమ్మెల్యే బాల్క సుమన్ అండదండలతోనే వాటిలో అమ్మకాలు జోరుగా సాగుతున్నాయని శనివారం ఓ ప్రకటనలో ఆరోపించారు.
బెల్టు షాపుల్లో మద్యం అమ్మకాలు వద్దని ఉద్యమించిన సామాజిక కార్యకర్త రుమాండ్ల రాధిక సహా 11 మంది మహిళలపై పీడీ కేసులు పెట్టడం దారుణమని ఫైర్ అయ్యారు. మహిళలకు కేసీఆర్ సర్కారు ఇస్తున్న గౌరవం ఇదేనా అని నిలదీశారు. మహిళలపై పెట్టిన కేసులను, అక్రమంగా నడిపిస్తున్న మద్యం దుకాణాలను వెంటనే ఎత్తేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే కాంగ్రెస్ పార్టీ తరఫున ఉద్యమించాల్సి ఉంటుందని హెచ్చరించారు.