మహబూబ్ నగర్ జిల్లాలో పుర పోరు ప్రశాంతం..

మహబూబ్ నగర్  జిల్లాలో పుర పోరు ప్రశాంతం..
  • ఉమ్మడి జిల్లాలోని కార్పొరేషన్, పలు మున్సిపాలిటీల్లో మందకొడిగా సాగిన పోలింగ్​
  • స్ట్రాంగ్​ రూములకు తరలిన బ్యాలెట్​ బాక్సులు
  • రేపు ఉదయం నుంచి కౌంటింగ్ ప్రారంభం

మహబూబ్​నగర్/వనపర్తి/నాగర్​కర్నూల్​/గద్వాల/మహబూబ్​నగర్​ అర్బన్​, వెలుగు :  కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మహబూబ్​నగర్ జిల్లాలో 69.5, నారాయణపేట జిల్లాలో 74.52, వనపర్తి జిల్లాలో 75, గద్వాల జిల్లాలో 84.69, నాగర్​కర్నూల్​ జిల్లాలో 77.64 శాతం పోలింగ్​ నమోదైంది. ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలోని 18 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్​కు బుధవారం ఎన్నికలు జరుగగా,  ఉదయం 7 గంటల నుంచి పోలింగ్​ ప్రక్రియ ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది.

అప్పటికే ఇంకా క్యూ లైన్​లో ఉన్న వారికి ఓటు వేసేందుకు అనుమతించారు. పోలింగ్​ సమయం పూర్తి కాగానే ఎన్నికల సిబ్బంది బ్యాలెట్​ బ్యాక్సులను ఆఫీసర్ల ఎదుట సీల్​ చేశారు. అనంతరం బ్యాలెట్​ బ్యాక్సులను పోలీసు బందోబస్తు మధ్య స్ట్రాంగ్​రూమ్​లకు తరలించారు. స్ట్రాంగ్రూమ్​ల వద్ద ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు బ్యాలెట్​ బ్యాకులను తెరిచి ఓట్లను లెక్కించనున్నారు. కాగా, పోలింగ్​ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని ఒకటి, రెండు చోట్ల చిన్న చిన్న ఘటనలు మినహా పోలింగ్​ సజావుగా సాగడంతో ఆఫీసర్లు ఊపిరి పీల్చుకున్నారు. 

 మందకొడిగా ప్రారంభమై..

పాలమూరు జిల్లాలోని మహబూబ్​నగర్​ కార్పొరేషన్​లో పోలింగ్​ మందకొడిగా సాగింది. ఉదయం 7 గంటలకు పోలింగ్​ ప్రారంభమైనా ఓటర్లు కేంద్రాలకు వచ్చేందుకు ఆసక్తి చూపలేదు. దీంతో ఉదయం 9 గంటల వరకు 12.36 శాతమే పోలింగ్ జరుగగా, 11 గంటల వరకు 27.7 శాతం, మధ్యాహ్నం ఒంటి గంటకు 44.58 శాతం, మూడు గంటలకు 57.63 శాతం, సాయంత్రానికి 67.73 శాతం పోలింగ్​ మాత్రమే నమోదైంది.

భూత్పూర్​ మున్సిపాల్టీలోనూ ఉదయం 9 గంటల వరకు 12.21 శాతం పోలింగ్​ నమోదు కాగా.. ఆ తర్వాత పుంజుకుంది. మొత్తంగా ఈ మున్సిపాల్టీలో 84.85 శాతం పోలింగ్​ నమోదైంది. దేవరకద్రలో ఉదయం తొమ్మిది గంటల వరకు 17.81 శాతం పోలింగ్​ జరుగగా, 11 గంటలకు వరకు 43.56 శాతం ఓట్లు పోల్​ అయ్యాయి. మొత్తంగా 85.51 శాతం ఓట్లు పోల్​ అయ్యాయి. నారాయణపేట, వనపర్తి, నాగర్​కర్నూల్, గద్వాల జిల్లాలోని మున్సిపాల్టీలోనూ ఇదే తరహా పోలింగ్ కొనసాగింది. 

కేంద్రాలను విజిట్ చేసిన కలెక్టర్లు, ఎస్పీలు

పోలింగ్​ సందర్భంగా కార్పొరేషన్​తోపాటు ఆయా మున్సిపాలిటీల్లోని పోలింగ్​ స్టేషన్​లను కలెక్టర్లు ఆయా జిల్లా కలెక్టర్లు విజయేందిర బోయి, సిక్తా పట్నాయక్, సంతోష్, బదావత్​ సంతోష్, ఆదర్శ్​ సురభి​ సందర్శించారు. ఓటు హక్కునూ వినియోగించుకున్నారు. ఎన్నికల సరళిని పరిశీలించారు. అక్కడి ఏర్పాట్లపై ఆరా తీశారు. ఆయా జిల్లాల ఎస్పీలు డి.జానకి, వినీత్​ పోలింగ్, సునీతారెడ్డి,  శ్రీనివాసరావు, ఎస్పీ సంగ్రామ్​ సింగ్​  సెంటర్లను విజిట్​ చేశారు. అక్కడ బందోబస్తుపై ఆరా తీశారు. ఎలాంటి అవాంఛనీ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట బందోబస్తు నిర్వహించాలని సిబ్బంది సూచనలు చేశారు. 

చెదురుమదురు ఘటనలు ఇలా..

మహబూబ్​నగర్​, నారాయణపేట జిల్లాల్లో ఎన్నికల నేపథ్యంలో పలు చెదురుమదురు ఘటనలు చోటు చేసుకున్నాయి. 
    
మహబూబ్​నగర్​ కార్పొరేషన్​లోని 45 డివిజన్​లోని ఓట్లు తారుమారు అయ్యాయని ఉదయం కొందరు అభ్యర్థులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీంతో దాదాపు 15 నిమిషాల పాటు పోలింగ్ నిలిచి పోయింది. వెంటనే అలర్ట్​ అయిన ఆఫీసర్లు ఓటర్​ లిస్టును చెక్​ చేశారు. లిస్ట్​లో ఎలాంటి పొరపాట్లు లేకపోవడంతో పోలింగ్​ను తిరిగి ప్రారంభించారు. 
    
కార్పొరేషన్​లోని 39వ వార్డు పరిధిలో ఉన్న మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. దొంగ ఓట్లు వేస్తున్నారని బీఆర్​ఎస్​ లీడర్లు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో పోలీసులకు వారికి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు.
    
నూతనంగా ఏర్పాటైన మద్దూరు మున్సిపాల్టీలోని పలు వార్డుల్లో లీడర్లు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. 14, 15, 16వ వార్డుల్లో  పోలింగ్​ కేంద్రం ఆవరణ లోపల ఉన్న లీడర్లను ఇక్కడి నుంచి వెళ్లిపోయాలని పోలీసులు చెప్పడంతో లీడర్లు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. 
    
కొల్లాపూర్​ మున్సిపాలిటీలోని 1వ,8వ,9వ,19వ వార్డులో కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ మద్దతుదారుల మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. కాంగ్రెస్​ నాయకులు పోలింగ్​ సెంటర్​లో ప్రచారం నిర్వహిస్తున్నారని బీఆర్​ఎస్​ లీడర్లు అభ్యంతరం తెలిపారు. ఒకరినొకరని తోసేసుకున్నారు. 
    
నాగర్​కర్నూల్​ 14,15వార్డులో కాంగ్రెస్​,బీఆర్ఎస్​ మద్దతుదారుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. 14ఏండ్ల వయస్సున్న బాలికతో కాంగ్రెస్​ నాయకులు ఓటేయిస్తున్నారని బీఆర్ఎస్​ లీడర్లు అభ్యంతరం తెల్పడంతో ఓటు వేయడానికి వచ్చిన మహిళలు అక్కడి నుంచి పరుగులు తీశారు. 14వ వార్డులో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్​ రెడ్డిని ఆయన మాజీ అనుచరులు దుర్భాషలాడారు. 
    
కల్వకుర్తిలోని 16వ వార్డులో ఓటర్ల వేలికి పెట్టిన ఇంక్​ పోతుందని అక్కడి అభ్యర్థి ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు.