- మంచిర్యాల మెడికల్ కాలేజీకి మూడు బస్సులు అందించిన ఎంపీ
కోల్బెల్ట్, వెలుగు: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తున్నదని, స్టూడెంట్స్ కు మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నదని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. మంచిర్యాల మెడికల్కాలేజీ స్టూడెంట్స్రవాణా కోసం ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి రూ.80 లక్షలతో కొనుగోలు చేసిన మూడు బస్సులను కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి ఎంపీ వంశీకృష్ణ శుక్రవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ఇటీవల తాను కాలేజీని సందర్శించినప్పుడు ట్రాన్స్పోర్ట్ సౌకర్యం ఏర్పాటు చేయాలని స్టూడెంట్స్ కోరారని, దాన్ని దృష్టిలో పెట్టుకొని బస్సులు కొనుగోలు చేయాలని కలెక్టర్కు సూచించినట్టు చెప్పారు. ఎంపీ ల్యాడ్స్నుంచి రెండు, డీఎంఎఫ్టీ ఫండ్స్నుంచి మరో బస్సు కొనుగోలు చేసినట్లు చెప్పారు.
ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని, విద్యార్థులు ఏకాగ్రతతో చదివి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలని సూచించారు. చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని, త్వరలో స్పోర్ట్స్ కిట్లను అందిస్తామని చెప్పారు. రవాణా సమస్య తీర్చిన ఎంపీ వంశీకృష్ణకు స్టూడెంట్లు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కాలేజీ యాజమాన్యం, కలెక్టర్కుమార్ దీపక్, స్టూడెంట్లు ఎంపీని సన్మానించారు.
ప్రజలకు మెరుగైన రైల్వే సేవలు అందిస్తున్నం
పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ప్రజా సమస్యలన్నింటినీ పరిష్కరిస్తున్నట్లు ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు. గత రెండేండ్లలో కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చి రామగుండం, బెల్లం పల్లి, రేచిని తదితర ప్రాంతాల్లో ఓవర్ బ్రిడ్జీలు, ఇతర అభివృద్ధి పనులను చేపట్టామని, ప్రజలకు మెరుగైన రైల్వే సేవలను అందించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.
మంచిర్యాల రైల్వే స్టేషన్ లో వందే భారత్ రైలు హాల్ట్ కల్పించామని, ప్రజల డిమాండ్ కు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ వైస్ ప్రిన్సి పాల్స్ రేఖ, జగతీ దేవి, హెచ్ఓడీ శ్రీకాంత్, ఏడీ తులసీదేవి, అధికారులు పాల్గొన్నారు.
