బిజినెస్​లో అడ్డొస్తున్నాడని బాబాయిని చంపిండు

బిజినెస్​లో అడ్డొస్తున్నాడని బాబాయిని చంపిండు

గోదావరిఖని, వెలుగు: రియల్‌‌‌‌ ఎస్టేట్​బిజినెస్​కు అడ్డొస్తున్నాడని పెద్దపల్లి జిల్లాలో వరుసకు బాబాయ్ అయ్యే వ్యక్తిని చంపేశాడు. కేసుకు సంబంధించిన వివరాలను రామగుండం కమిషరేట్​ఆఫీసులో సీపీ రెమా రాజేశ్వరి బుధవారం మీడియాకు వెల్లడించారు. రామగుండం మండలం ఎన్టీపీసీ ఖాజిపల్లికి చెందిన మేకల లింగయ్య(48) కొన్నేండ్లుగా రియల్‌‌‌‌ ఎస్టేట్‌‌‌‌ బిజినెస్‌‌‌‌ చేస్తున్నాడు. ఇతనికి సమీప బంధువైన గోదావరిఖని గంగానగర్‌‌‌‌‌‌‌‌కు చెందిన మేకల కుమారస్వామి కొన్నాళ్ల కింద ఖాజిపల్లికి షిఫ్ట్​అయ్యాడు. అక్కడే ఇల్లు కట్టుకుని ఉంటున్నాడు. 

కుమారస్వామి రియల్‌‌‌‌ ఎస్టేట్​తోపాటు పాల వ్యాపారం మొదలుపెట్టాడు. కుమారస్వామి అతనికి చెందిన తొమ్మిదిన్నర గుంటల స్థలాన్ని విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా, లింగయ్య లిటిగేషన్లు పెట్టి స్థలం అమ్ముపోకుండా అడ్డుకొంటున్నాడని పగ పెంచుకున్నాడు. తనను బిజినెస్​లో తొక్కేసి లింగయ్య ఒక్కడే ఎదగాలని చూస్తున్నాడని, ఎలాగైనా అతని అడ్డు తొలగించుకోవాలని కుమారస్వామి డిసైడ్​అయ్యాడు. ఈ క్రమంలో అతని వద్ద డ్రైవర్‌‌‌‌‌‌‌‌గా పనిచేసే ధర్మారపు అనిల్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌, సమీప బంధువైన కమాన్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌కు చెందిన కట్ల శంకర్‌‌‌‌‌‌‌‌, కరీంనగర్‌‌‌‌‌‌‌‌లో ఉండే స్నేహితుడు కె.విద్యాసాగర్‌‌‌‌తో కలిసి హత్యకు ప్లాన్‌‌‌‌‌‌‌‌చేశాడు. 

ఈ నెల 18న రాత్రి 9 గంటల సమయంలో లింగయ్య ఇంటి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలోకి పెంపుడు కుక్కతో వాకింగ్‌‌‌‌‌‌‌‌కు వెళ్లగా, అప్పటికే అక్కడ వేచి చూస్తున్న కుమారస్వామి, అనిల్​కుమార్, శంకర్, విద్యాసాగర్ ఒక్కసారిగా అటాక్​చేశారు. కత్తులతో పొడిచి చంపారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు నలుగురిని బుధవారం మేడిపల్లి సెంటర్‌‌‌‌‌‌‌‌ వద్ద అరెస్ట్‌‌‌‌‌‌‌‌ చేసి రిమాండ్‌‌‌‌‌‌‌‌కు తరలించారు. ప్రెస్​మీట్​లో పెద్దపల్లి డీసీపీ వైభవ్‌‌‌‌‌‌‌‌ గైక్వాడ్‌‌‌‌‌‌‌‌, గోదావరిఖని ఏసీపీ తులా శ్రీనివాసరావు, రామగుండం సీఐ చంద్రశేఖర్‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌, ఎస్సైలు జీవన్‌‌‌‌‌‌‌‌, సంతోశ్‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.