
కరోనాపై దేశం యుద్దం ప్రకటించింది. వైరస్ కట్టడి కోసం ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపుకు యావత్ జనం అండగా నిలిచింది. దేశ వ్యాప్తంగా జనతా కర్ఫ్యూ సంపూర్ణంగా సాగుతోంది. ప్రజలంతా స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. 130 కోట్ల మంది జనాలు ఇండ్లకే పరిమితమయ్యారు. ప్రభుత్వ, ప్రైవేటు రవాణా పూర్తిగా నిలిచిపోయింది. పెద్ద పెద్ద మాల్స్తో పాటు గల్లీలో ఉండే చిన్న చిన్న దుకాణాలు కూడా తెరుచుకోలేదు. పెట్రోల్ బంక్లు, హోటళ్లు, రెస్టారెంట్లు మొదలైనవి అన్నీ మూతపడ్డాయి. మెట్రో, ఎంఎంటీస్ రైళ్లు కూడా అన్నీ ఆగిపోయాయి. కరోనా మహమ్మారిని దేశం నుంచి తరిమికొట్టేందుకు ప్రభుత్వానికి అండగా ఉంటామని జనాలు సంకేతమిచ్చారు. దేశవ్యాప్తంగా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటలకు జనతా కర్ఫ్యూ కొనసాగనుంది.
నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్ రోడ్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. వైరస్ భయానికి జనాలు రోడ్ల మీదకు రావాలంటేనే భయపడుతున్నారు. వైరస్ వచ్చిన తర్వాత బాధపడటం కంటే.. రాకముందే ఒక్కరోజు ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉండటమే మంచిదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. దాంతో రోడ్లు, గళ్లీలు ఎక్కడికక్కడ ఖాళీగా మారాయి. బంద్ సందర్భంగా ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యయి. నిత్యం వేలకొద్ది ప్రయాణికుల్ని గమ్యస్థానాలకు చేర్చే ఎంజీబీఎస్ బస్టాండ్ పూర్తిగా ఖాళీగా మారిపోయింది. తెలంగాణ ప్రభుత్వం ఏపీ నుంచి ఒక్క బస్సును కూడా రానీయడంలేదు. ప్రతీ బస్ డిపోలో అత్యవసరం కోసం కేవలం 5 బస్సులు మాత్రమే సిద్ధంగా ఉంచారు. విజయవాడ-హైదరాబాద్ రహదారిపై వాహానాలను నిషేధించారు. దాదాపు ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రంతో సంబంధం ఉన్న బార్డర్లు అన్నీ మూసేశారు. ఇక రైళ్ల విషయానికొస్తే దేశవ్యాప్తంగా రైళ్లన్నీ ఎక్కడికక్కడే ఆగిపోయాయి.
For More News..