
- పోయినేడాది రాష్ట్రవ్యాప్తంగా 1.16 లక్షల ఫిర్యాదులు
- ట్విట్టర్, వాట్సాప్, ఫేస్ బుక్ లో పోస్టింగ్స్
- అత్యధికంగా హైదరాబాద్ కమిషనరేట్లో 9 వేలకు పైగా కంప్లయింట్లు.. షీటీమ్స్కు
- ఆరు వేలకు పైగా ఫిర్యాదులు
హైదరాబాద్ : సోషల్ మీడియా.. కంప్లయింట్ బాక్సుగా మారింది. పోలీస్ స్టేషన్కు వెళ్లకుండానే ప్రజలు తమ సమస్యలపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఇందుకోసం సోషల్ మీడియాను ఎక్కువగా వాడుతున్నారు. జనం తమ సమస్యలపై ట్విట్టర్, వాట్సాప్, ఫేస్ బుక్ లో పోస్టులు పెడుతూ.. ఆ పోస్టులను ఆయా పోలీస్ కమిషనరేట్లు, ఎస్పీ ఆఫీస్ అకౌంట్లకు ట్యాగ్ చేస్తున్నారు. రోడ్లపై యాక్సిడెంట్లు, ట్రాఫిక్ ఉల్లంఘనలు, న్యూసెన్స్, ఈవ్ టీజింగ్.. ఇలా ఎలాంటి క్రైమ్ జరిగినా పోలీసులకు ఆన్ లైన్ లో సమాచారం చేరవేస్తున్నారు. రాజకీయ నాయకులు, పోలీసులు, ఇతర ప్రముఖులు ఎవరైనా ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే.. ఫొటోలు తీసి, సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసి ప్రశ్నిస్తున్నారు. ఇలా వివిధ సమస్యలపై పోలీసులకు పోయినేడాది రాష్ట్ర వ్యాప్తంగా 1,16,431 ఫిర్యాదులు సోషల్ మీడియాలో అందాయి. అత్యధికంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 9 వేలకు పైగా కంప్లయింట్లు వచ్చాయి.
లోకల్ లో పట్టించుకోకపోతే...
లోకల్ పోలీసులు తమ సమస్యలను పట్టించుకోకపోతే బాధితులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. స్టేషన్ లో న్యాయం జరగడం లేదని భావిస్తే, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు సోషల్ మీడియాలో ఫిర్యాదు చేస్తున్నారు. లోకల్ పీఎస్తో పాటు డీజీ స్థాయి అధికారులకు తమ కంప్లయింట్ ను ట్యాగ్ చేస్తున్నారు. ఇలాంటి కంప్లయింట్స్ పై ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఉంటుంది. బాధితుల సమస్యలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటి కంప్లయింట్లు ఎక్కువగా ట్విట్టర్ లో వస్తున్నాయి.
కంప్లయింట్ల పరిష్కారానికి ప్రత్యేకంగా ఐటీ సెల్...
పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్ లో భాగంగా హాక్ ఐ, ఈ–మెయిల్ తో పాటు ట్విట్టర్, ఫేస్ బుక్, వాట్సాప్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లోనూ పోలీసులు ఫిర్యాదులు తీసుకుంటున్నారు. వీటి పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. డీజీపీ ఆఫీస్ సహా అన్ని కమిషనరేట్లు, ఎస్సీ కార్యాలయాల్లో స్పెషల్ గా ఐటీ సెల్ ఏర్పాటు చేశారు. ఈ టీమ్ లో ఐదుగురు ఉంటారు. వీళ్లు ఎప్పటికప్పుడు సోషల్ మీడియా కంప్లయింట్లను మానిటర్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో జనం చేసే పోస్టులు డిపార్ట్ మెంట్లోని డీజీ స్థాయి అధికారి నుంచి ఫీల్డ్లో ఉండే పెట్రోలింగ్, బ్లూకోల్ట్స్ సిబ్బంది వరకు చేరుతున్నాయి. దీంతో తమకు అందిన ఫిర్యాదులపై సంబంధిత అధికారులు వెంటనే స్పందిస్తున్నారు. ఫిర్యాదుదారులకు కాల్ చేసి వివరాలు సేకరిస్తున్నారు. లేదంటే ఫిర్యాదు పోస్ట్ చేసిన వారికి సంబంధిత పోలీస్ స్టేషన్ నంబర్స్ అందిస్తున్నారు. నేర తీవ్రతను బట్టి అవసరమైతే లోకల్ సిబ్బందిని బాధితుల వద్దకు పంపిస్తున్నారు.
షీటీమ్స్కు ఫిర్యాదుల వెల్లువ
ఈవ్టీజింగ్కి గురయ్యే మహిళలు షీ టీమ్స్, విమెన్ సేఫ్టీ వింగ్ వాట్సాప్ నంబర్కి కంప్లయింట్లు పంపిస్తున్నారు. కుటుంబంలో గొడవలతో బయటకు రాలేని మహిళలు కూడా సోషల్ మీడియా ద్వారా పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇలా ఏటా ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ ద్వారా వచ్చే ఫిర్యాదుల సంఖ్య పెరుగుతోంది. నిరుడు 6,157 కంప్లయింట్లు వచ్చాయి. వాటిని పోలీసులు సంబంధిత అధికారులకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. విమెన్ పీఎస్ లేదా భరోసా సెంటర్కు తరలించి బాధితుల నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. కేసుల తీవ్రతను బట్టి కేసులు నమోదు చేస్తున్నారు. కాగా, మెట్రో, బస్ స్టేషన్లు, కాలేజీలు, పబ్లిక్ ప్లేసెస్లో షీటీమ్స్ వాట్సాప్ నంబర్ను పోలీసులు అందుబాటులో పెట్టారు. క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి తమ కంప్లయింట్ పోస్ట్ చేసేలా ఏర్పాటు చేశారు.
ప్రముఖులను ప్రశ్నిస్తున్నరు..
వివిధ సమస్యలపై జనం సోషల్ మీడియా వేదికగా పోలీసులను ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా ట్రాఫిక్ ఉల్లంఘనలపై పోస్టులు పెడుతున్నారు. రాజకీయ నాయకులు, పోలీసులు, ఇతర ప్రముఖులు రూల్స్ బ్రేక్ చేస్తే ఫొటోలు తీసి ట్విట్టర్, ఫేస్ బుక్, వాట్సాప్ లో అప్ లోడ్ చేస్తున్నా రు. కామన్ మ్యాన్ కే రూల్స్ వర్తిస్తాయా? వీళ్లకు వర్తించవా? అంటూ ప్రశ్నిస్తు న్నారు. సోషల్ మీడియా లో ఇలాంటి కంప్లయింట్లు చాలా వరకు ఉన్నాయి. వీటిని పోలీసులు కూడా పరిష్కరి స్తున్నారు. ట్రాఫిక్ ఐటీ సెల్ సిబ్బంది ఆయా వెహికల్స్ ను గుర్తించి, జరిమా నాలు వేస్తున్నా రు. ఆ చలాన్లను రీట్వీట్ కూడా చేస్తున్నారు.
గ్రేటర్ లోని కమిషనరేట్ల వాట్సాప్ నంబర్లు...
హైదరాబాద్: 94906 16555
సైబరాబాద్: 94906 17444
రాచకొండ : 94906 17111