
- భద్రాద్రి జిల్లా ఇల్లెందులో సీఆర్టీ అసభ్య ప్రవర్తన
- డబుల్మీనింగ్మాటలు...ఎక్కడ పడితే అక్కడ తాకుడు
- కొట్టి పోలీసులకు అప్పజెప్పిన పేరెంట్స్
ఇల్లెందు, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో ఉన్న గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఓ కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్ (సీఆర్టీ) విద్యార్థులతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో తల్లిదండ్రులు దేహశుద్ధి చేశారు. కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్ ఎ.రాందాస్ 9వ తరగతి విద్యార్థినులతో కొంతకాలంగా వెకిలి చేష్టలు చేస్తున్నాడు. భయంతో కొద్ది రోజులు మౌనంగా ఉన్న విద్యార్థినులు తర్వాత హెచ్ఎంకు ఫిర్యాదు చేయడంతో పాటు తల్లిదండ్రులకు చెప్పారు.
హెచ్ఎం సువర్ణపాక పద్మావతి.. టీచర్ వివరణ కోరగా తప్పు జరిగిందని, మళ్లీ జరగకుండా చూసుకుంటానని లెటర్ రాసిచ్చాడు. ఇంతలో అక్కడికి వచ్చిన తల్లిదండ్రులు రాందాస్ను చితకబాదారు. ఈ సందర్భంగా పేరెంట్స్ మాట్లాడుతూ తమ పిల్లలతో డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడుతూ, ఎక్కడ పడితే అక్కడ కావాలని తాకుతూ ఇబ్బందులు పెడుతున్నాడని వాపోయారు. ఇల్లెందు ఎస్సై పఠాన్ నాగుల్ మీరా స్కూల్కు వచ్చి టీచర్ను పోలీస్ స్టేషన్కు తరలించారు.
హెచ్ఎం ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేశారు. ఇదే టీచర్ గతంలో కూడా ఇలాగే చేయడంతో అప్పటి ఐటీడీఏ పీవో, ఐటీడీఏ డీడీ, ఇల్లెందు ఏటీడీవోకు హెచ్ఎం ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారులు మొదటి తప్పుగా పరిగణించి ఎలాంటి చర్యలు తీసుకోకుండానే వదిలేశారు. అంతేగాకుండా అదే పాఠశాలలో టీచర్గా కొనసాగిస్తున్నారు. దీంతో చేసిన తప్పులే మళ్లీ చేసి దొరికి తల్లిదండ్రుల చేతిలో దెబ్బలు తిని జైలు పాలయ్యాడు.