- చిన్న ప్యాకెట్లే కొంటున్నరు
- బిస్కెట్ల నుంచి నూనెల దాకా అంతా ఇంతే
- ఖర్చు తగ్గించుకునేందుకు జనాల యత్నం
- 5‑10 రూపాయల ప్యాకెట్ల తయారీ పై కంపెనీల దృష్టి
న్యూఢిల్లీ: ప్రతి ఒక్క వస్తువు ధర పెరగడంతో జనం ఆచితూచి కొంటున్నారు. పెద్ద ప్యాకెట్లకు బదులు చిన్న ప్యాకెట్లను, వ్యాల్యూ ప్యాకెట్లను ఎంచుకుంటున్నారు. బిస్కెట్ల నుంచి నూనె ప్యాకెట్ల దాకా అన్ని ప్రొడక్టుల కేటగిరీల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తున్నదని కిరాణాషాపుల వాళ్లు చెప్తున్నారు. ఈ విషయాన్ని గమనించిన పార్లే, డాబర్ ఇండియా వంటి ఎఫ్ఎంసీజీ కంపెనీలు ‘లో యూనిట్ ప్యాక్స్’(ఎల్యూపీ)పై ఫోకస్ చేస్తున్నాయి. చిన్న ప్యాకెట్లనే ఎక్కువగా మార్కెట్లోకి తెస్తున్నాయి. బిస్కెట్లు, సాల్టీ స్నాక్స్, బేకరీ కేటగిరీల్లో ఎల్యూపీలు ఎక్కువగా అమ్ముడవుతున్నాయని పార్లే ప్రొడక్ట్స్సీనియర్ కేటగిరీ హెడ్ బుద్ధ కృష్ణారావు చెప్పారు. రూ.5, రూ.10 ప్యాక్లకు గిరాకీ బాగా పెరిగిందన్నారు. రూ.30, రూ.60 ధర ఉన్న వ్యాల్యూ ప్యాక్స్ కూడా బాగా అమ్ముడవుతున్నాయని తెలిపారు. గత నెలలో కన్జూమర్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ 7.79 శాతానికి చేరుకున్న నేపథ్యంలో ఆయన ఈ విషయం చెప్పారు. ఇంత ఎక్కువగా ఇన్ఫ్లేషన్ రికార్డు కావడం 2014 మే తర్వాత ఇదే మొదటిసారి. డాబర్ సీఈవో మోహిత్ మల్హోత్రా మాట్లాడుతూ.. కిరాణా బడ్జెట్ను తగ్గించుకోవడానికి చాలా మంది చిన్న ప్యాకెట్లు కొంటున్నారని తెలిపారు. పెద్ద ప్యాకుల కంటే రూపాయి, ఐదు రూపాయలు, రూ.20 ధరలు ఉన్న ప్యాకెట్ల అమ్మకాలు పెరుగుతున్నాయని వివరించారు. తమ కంపెనీల్లోనూ ఇదే తరహా పరిస్థితి ఉందని ఏషియన్ పెయింట్స్, హిందుస్థాన్ యూనిలీవర్(హెచ్యూఎల్) వంటివి చెప్తున్నాయి. కస్టమర్లు వ్యాల్యూ ప్యాక్స్కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం వల్ల నిరుడితో పోలిస్తే ఈసారి తమ అమ్మకాలు 60 శాతం పెరిగాయని అమూల్ తెలిపింది. పట్టణం, పల్లె అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో కస్టమర్ల చిన్న ప్యాక్లకే మొగ్గు చూపుతున్నారని పేర్కొంది.