డంపింగ్ ​యార్డుల ​పొగ మొస మర్రనిస్తలే..

డంపింగ్ ​యార్డుల ​పొగ మొస మర్రనిస్తలే..
  •     వేస్టేజీని తగలబెడుతుండటంతో జనవాసాలను కమ్మేస్తున్న పొగ
  •     శ్వాసకోశ వ్యాధుల బారిన స్థానికులు
  •     మున్సిపాలిటీల్లో డంపింగ్​యార్డులకు స్థలాలు కరువు
  •     బయోగ్యాస్​ ప్లాంట్లకు ఏర్పాట్లలో అలసత్వం

కోల్​బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా మున్సిపాలిటీల్లో డంపింగ్​యార్డుల నుంచి వెలువడే కాలుష్యంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. జనవాసాల సమీపంలోని డంపింగ్​యార్డుల్లో పేరుకుపోతున్న చెత్తను సిబ్బంది కాలబెడుతుండడంతో దట్టమైన పొగ, ఘాటైన వాసనతో జనాలను ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ప్లాస్టిక్​కవర్లు, బాటిళ్లు, రబ్బర్లు, ఇతర వ్యర్థాలను కాల్చడం వల్ల విషపూరితమైన రసాయనాలు విడుదలై గాలి పూర్తిగా కలుషితం అవుతోంది. ఈ పొగతో జనాలు శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నారు.

రోడ్డు పక్కనే చెత్త కుప్పలు

జనావాసాల మధ్య ఉన్న డంపింగ్​యార్డులను దూర ప్రాంతాలకు తరలించాలని స్థానికులు చాలా కాలంగా పోరాడుతున్నా.. లీడర్లు, ఆఫీసర్లు పట్టించుకోవడంలేదు. మరికొన్ని మున్సిపాలిటీల్లో డంపింగ్​ యార్డుల నిర్మాణానికి ఏండ్లు గడుస్తుండడంతో జనవాసాల మధ్య, రోడ్ల పక్కన చెత్త పడేస్తున్నారు. మంచిర్యాల, బెల్లంపల్లి, క్యాతనపల్లి, నస్పూర్, చెన్నూరు, లక్సెట్టిపేటలో శాశ్వత డంపింగ్​యార్డులు లేక జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

బెల్లంపల్లి పట్టణంలోని బస్తీ పోచమ్మ చెరువు పరిసర ప్రాంతాలోని తాళ్ల గురిజాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఐటీడీఏ నర్సరీ మధ్యలోని డంపింగ్​యార్డులో నుంచి నిత్యం వచ్చే పొగతో ప్రజలు సతమతమవుతున్నారు. రాత్రి అయ్యిందంటే దట్టమైన పొగ పట్టణంలోని గోల్​బంగ్లా బస్తీ, బెల్లంపల్లి బస్తీ, నంబర్​టూ ఇన్ క్లైన్​బస్తీ, కాసిరెడ్డిపల్లి, బూడిదగడ్డ బస్తీ, కన్నాలబస్తీ, టేకులబస్తీని కమ్మేస్తోంది. చెత్త పోస్తున్న రోడ్డులో మండల పరిషత్ కార్యాలయం, గర్ల్స్ జూనియర్​కాలేజ్, వెటర్నరీ ఆస్పత్రి, పోచమ్మ ఆలయం, ఐటీడీఏ ఉద్యానవనం, ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల, కేవీకే, సాంఘిక సంక్షేమ బాలుర పాఠశాల, కస్తుర్బా విద్యాలయం, సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాల ​ఉన్నాయి. ఇవన్నీ ఉన్నా మున్సిపల్ అధికారులు కనీస అవగాహన లేకుండా చెత్తను రోడ్డు పక్కనే కుప్పలుగా పోస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. 

స్టూడెంట్లకు అస్వస్థత

మంచిర్యాల మున్సిపాలిటీలోని అండాలమ్మ కాలనీలో ఉన్న తాత్కాలిక డంప్​ యార్డును తరలించడంలో ఆఫీసర్లు జాప్యం చేస్తున్నారు. నివాస గృహాలకు సమీపంలో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్​ను తరచూ కాలబెట్టడంతో పొగ వెలువడి సమీప కాలనీ ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. డంపింగ్​యార్డును తరలించాలని కాలనీ వాసులు అనేకసార్లు మున్సిపల్​ వాహనాలను అడ్డుకున్నారు. 

చెత్త కాల్చడంతో పొగ, దుర్వాసనతో క్వారీ రోడ్డులో ఏర్పాటు చేసిన సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల విద్యార్థులు గత నెలలో అస్వస్థతకు గురయ్యారు. తర్వాత ఆ స్కూల్​కు పిల్లలను పంపడానికి తల్లిదండ్రులు నిరాకరించడంతో హాస్టల్​ను ఇటీవల హాజీపూర్​ మండలంలోని ముల్కల్లకు తరలించారు. క్యాతనపల్లి మున్సిపాలిటీలో డంప్​యార్డు నిర్మించేందుకు స్థలం లేదంటూ మున్సిపల్​అధికారులు చెత్తను రామకృష్ణాపూర్​ సింగరేణి సీహెచ్​పీ సమీపంలోని మందమర్రి-–గోదావరిఖని కోల్​బెల్ట్​రహదారి పక్కన పడేస్తున్నారు. చెత్తను తరచూ కాలుస్తుండడంతో వచ్చే పొగ, దుర్వాసనతో సమీపంలో నివసించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నస్పూర్ మున్సిపాలిటీలోని డంపింగ్​ యార్డుకు స్థలం లేకపోవడంతో పోచమ్మ ఏరియాలో సింగరేణి ఖాళీ స్థలంలో చెత్త పోస్తున్నారు. చెన్నూరు మున్సిపాలిటీలోని బుద్దారం బైపాస్​రోడ్​లో 10 ఎకరాల్లో నిర్మిస్తున్న డంపింగ్​యార్డు పనులు స్లోగా నడుస్తున్నాయి. లక్సెట్టిపేట మున్సిపాలిటీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

పెరుగుతున్న చెత్త

మంచిర్యాల మున్సిపాలిటీలో నిత్యం 60 మెట్రిక్​ టన్నుల చెత్త పోగవుతోది. నస్పూర్​లో 55 మెట్రిక్ టన్నులు, బెల్లంపల్లిలో 36, క్యాతనపల్లిలో 21, మందమర్రిలో 35, చెన్నూరులో 17 టన్నులు, లక్సెట్టిపేటలో 17 మెట్రిక్​ టన్నులు జమవుతోంది. ఇటీవల పట్టణాల్లో జనాభా,  గృహాలు సంఖ్య పెరగడంతో చెత్త పెరుగుతోంది. ఉన్న 7 మున్సిపాలిటీల్లో ఎక్కడా తడి, పొడి చెత్తను వేరు చేయడంలేదు. బయోగ్యాస్​ ప్లాంట్ల ఏర్పాటుపై ఆఫీసర్లు నిర్లక్ష్యం చేస్తున్నారు. 

ఊపిరాడ్తలేదు

సింగరేణి మూసేసిన టింబర్​యార్డు సమీపంలో క్యాతనపల్లి మున్సిపల్​అధికారులు ఏర్పాటు చేసిన తాత్కాలిక డంపింగ్​యార్డు నుంచి నిత్యం దట్టమైన పొగ వస్తోంది. పొగ, దుర్వాసన కారణంగా ప్రజలు ఊపిరి తీసుకోలేకపోతున్నారు. యార్డును తరలించి సమస్య పరిష్కరించాలి.
మిట్టపెల్లి శ్రీనివాస్, సీపీఐ టౌన్​సెక్రటరీ, క్యాతనపల్లి మున్సిపాలిటీ