- సెలవులు, వర్క్ ఫ్రమ్ హోమ్తో పల్లెలకు జనం
- 30 లక్షల మంది వరకు వెళ్లినట్లు అంచనా
- ఇయ్యాల, రేపు మరో 10 లక్షల మంది తరలే చాన్స్
- తగ్గిన ట్రాఫిక్.. సందడి లేని మాల్స్, మల్టీప్లెక్స్లు
హైదరాబాద్, వెలుగు : హైదరాబాద్ నగరం సగం ఖాళీ అయింది. బతుకుదెరువు కోసం భాగ్యనగరం వచ్చిన జనం పల్లెబాట పట్టింది. సంక్రాంతి సెలవులతో ప్రజలు సొంతూర్లకు వెళ్లారు. వరుస సెలవులతో ఊరిబాట పట్టారు. దీంతో హైదరాబాద్లోని పలు ప్రాంతాలు జనాలు లేకుండా బోసిపోతున్నాయి. రోడ్లపై వాహనాల రద్దీ తగ్గింది. నిత్యం కిక్కిరిసిపోయే షాపింగ్ మాల్స్లో సందడి తగ్గింది. సుమారు 30 లక్షల మంది జనాభా తరలినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. కొందరు మాత్రం కరోనా భయంతో సిటీలోనే ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు.
30 లక్షల మంది పల్లె‘టూర్’..
ఏపీ వారికి సంక్రాంతి పెద్ద పండుగ. హైదరాబాద్ నగరంలో ఉంటున్న ఏపీవాసులు ఫెస్టివల్కు ఊర్లకు పోయారు. ఈ నెల 8వ తేదీ నుంచి విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా ఐటీ కంపెనీలు, ఇతర సంస్థలు వర్క్ఫ్రం హోం ఇచ్చాయి. దీంతో అనేక మంది బస్సులు, రైళ్లు, సొంత వాహనాల్లో వెళ్లారు. ఇప్పటిదాకా సుమారు 30లక్షల మంది ప్రజలు నగరం నుంచి తరలివెళ్లినట్లు అధికారులు భావిస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లోనే 20 లక్షల మంది ప్రయాణికులు వెళ్లినట్లు సంస్థ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఇందులో 25 లక్షల మంది దాకా ఏపీకి వెళ్లగా,5 లక్షల వరకు తెలంగాణలోని ఇతర ప్రాంతాలకు వెళ్లారు. గురు, శుక్రవారాల్లో మరో 10 లక్షల మందికి పైగా వెళ్లే చాన్స్ ఉంది.
అక్కడ నో ట్రాఫిక్..
హైదరాబాద్ నగరం నిత్యం ట్రాఫిక్, బండ్ల సౌండ్లు, జనాలతో రద్దీగా ఉంటుంది. ప్రయాణం చేయాలంటే గంటల కొద్దీ ట్రాఫిక్లో ఇబ్బంది పడాల్సి వస్తుంది. కొన్ని మార్గాల్లో కిలో మీటర్ ప్రయాణానికి15 నుంచి 20 నిమిషాలు పడుతుంది. అయితే ఇప్పుడు సిటీ ఖాళీ కావడంతో అనేక చోట్ల జనాలు లేక రోడ్లు బోసిపోయాయి. ముఖ్యంగా ఐటీ సెక్టార్లో గచ్చిబౌలి, మణికొండ, శేరిలింగంపల్లి, మాదాపూర్, కొండాపూర్, కూకట్పల్లి తదితర ప్రాంతాల్లో రద్దీ బాగా తగ్గింది. ట్రాఫిక్ క్లియర్ కావడంతోపాటు పొల్యుషన్ కూడా తగ్గినట్లయింది. రైల్వే స్టేషన్లు, బస్టాండ్ల రూట్లలో మాత్రం రద్దీ కొనసాగుతోంది.
సందడి కనిపిస్తలే..
సంక్రాంతి కావడంతో ఏపీ వాళ్లంతా ఇప్పటికే షాపింగ్ చేశారు. దీంతో మాల్స్లో సందడి తగ్గింది. మల్టీప్లెక్స్ల్లో సినిమా చూసేందుకు మినహా కొనుగోలు చేసేందుకు వచ్చేటోళ్లు తగ్గిపోయారు. బిజినెస్ లేకపోవడంతో వ్యాపారులు కూడా బంధువుల ఇళ్లు, సొంతూర్లకు చేరుకుంటున్నారు. పర్యాటక ప్రాంతాలు, పార్కుల్లోనూ హడావిడి కనిపించలేదు.
టోల్గేట్ల వద్ద సీన్ రివర్స్..
పండుగతో బస్సులు, రైళ్లు ఖాళీ లేకపోవడంతోపాటు కరోనాతో కొంత మంది సొంత వాహనాల్లో ఊర్లకు వెళ్తున్నారు. దీంతో హైవే రోడ్లన్నీ వాహనాలతో నిండిపోయాయి. పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అవుతోంది. విజయవాడ-–హైదరాబాద్ హైవేపై భారీగా వాహనాలు నిలిచిపోతున్నాయి. అయితే టోల్ గేట్ల వద్ద ట్రాఫిక్ జామ్ కావడం లేదు. గతంలో టోల్ గేట్ల వద్ద మ్యాన్యుదల్గా టోల్ ఛార్జీ చెల్లించేవారు. ఇప్పుడు పూర్తి స్థాయిలో ఫాస్టాగ్ అందుబాటులోకి రావడంతో వాహనాలు వెంటవెంటనే వెళ్లిపోతున్నాయి. దీంతో వాహనదారులకు రిలీఫ్కలిగింది. వాహనాలు బారులుతీరకుండా ఉండేందుకు నిర్వాహకులు ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నారు.