
కష్టపడి పనిచేయకుండా సులువుగా డబ్బులు సంపాదించేందుకు కొంతమంది దొంగతనాలను వృత్తిగా ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలో ఏటీఎం మిషన్లనే టార్గెట్ చేస్తూ డబ్బులను దొంగలించేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా గుర్తు తెలియని దుండగుడు ఓ ఏటీఎంను దోచుకునేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. వివరాల్లోకి వెళితే.. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి కొంపల్లి పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటిఎంను దోచుకునే ప్రయత్నం చేసి విఫలమయ్యాడు ఓ దొంగ.
జనవరి 17వ తేదీ అర్ధరాత్రి కొంపల్లి- దూలపల్లి రహదారి ప్రక్కనే ఉన్న ATM ను కొల్లగొట్టి నగదు దోచుకోవడానికి ఆ దొంగ ప్రయత్నించాడు.ఏటీఎంను తెరిచేందుకు దానితో కుస్తీ పడ్డాడు. అయితే, ఏం చేసినా ఏటీఎం మిషన్ ఓపెన్ చేయలేక.. చివరికి, ఆ దొంగ చేతులెత్తేశాడు. దీంతో చేసేదేంలేక దోచుకునేందుకు వచ్చిన దొంగ నిరాశగా వెనుతిరిగినట్లు తెలుస్తుంది.
జనవరి 18వ తేదీ గురువారం ఉదయం ATM కు వచ్చిన కస్టమర్స్.. మిషన్ ను బ్రేక్ చేసేందుకు ప్రయత్నించినట్లు గుర్తించి పేట్ బషీరాబాద్ పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఏటీఎంను పరిశీలించారు. ప్రాథమిక దర్యాప్తులో దొంగ ATM ను బ్రేక్ చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యాడని.. నగదును అపహరించలేదని గుర్తించారు. క్లూస్ టీంతో కలిసి సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసి.. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.