
తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ట్యాపింగ్ కేసులో రోజురోజుకూ కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకరరావును ఇప్పటికి నాలుగు సార్లు విచారించింది. మళ్లీ ఈ రోజు ( జూన్ 20) కూడా ఆయనను విచారిస్తున్నారు. నిన్న ( జూన్ 19) 9 గంటల పాటు సుదీర్ఘంగా విచారించిన సిట్ బృందం పలు కీలకమైన ప్రశ్నలు అడిగిందని సమాచారం అందుతోంది.
ఫోన్ ట్యాపింగ్ విషయంలో మావోయిస్టులకి సహకరిస్తున్నారని కారణాలు చూపి లీగల్ ఇంటర్ సెప్షన్ (ఎల్ ఐ) చేసేందుకు ప్రభాకరరావు అనుమతి తీసుకున్నారు. నిఘా పెట్టిన వ్యక్తులు నిఘా పెట్టిన వ్యక్తులు మావోయిస్టులకి సహకరిస్తున్నట్లు ఆధారాలు ఉన్నాయా అనే విషయంపై సిట్ అధికారులు ఆరా తీశారు.
జర్నలిస్టులు.. పలువురు రాజకీయ నేతలు వందలాది మంది ఒకేసారి ఎలా మావోయిస్టులకు సహకరించారని మీరు ఎలా భావించారని ప్రభాకరరావును సిట్ ప్రశ్నించింది. అదే నిజమైతే ఎందుకు కేసు నమోదు చేయలేదని ప్రశ్నల వర్షం కురిపించారు.
ఇప్పటికే ప్రణీత్ రావు స్టేట్ మెంట్ ఆధారంగా ప్రభాకర్ రావుని విచారించిన సిట్ అధికారులకు సరైన సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నారని సమాచారం అందుతోంది. ఈ విషయంలో ఆయన దర్యాప్తునకు సహకరించడం లేదని .. సుప్రీంకోర్టుకు సిట్ అధికారులు తెలిపే అవకాశం ఉంది.
ఈ రోజు ( జూన్ 20) మరికొంతమంది స్టేట్ మెంట్ ని రికార్డ్ చేయనున్నారు.. గోనె ప్రకాశరావు సాక్షి గా వాంగ్మూలం ఇవ్వనున్నారు.
తెలంగాణ డీజీపీ జితేందర్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్(ఎస్పీఎఫ్) అదనపు డీజీ అనిల్ కుమార్ల వాంగ్మూలాలను ఈ కేసుకు సంబంధించి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) అధికారులు నమోదు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర హౌంశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీగా జితేందర్, రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్గా అనిల్ కుమార్లు బాధ్యతలను నిర్వహించారు. ఆ సమయంలో సంఘవిద్రోహ శక్తులు, నిషేధిత మావోయిస్టుల ఫోన్ట్యాపింగ్ను జరిపే ప్రక్రియను పర్యవేక్షించే రివ్యూ కమిటీలో జితేందర్, అనిల్ కుమార్లు కూడా సభ్యులుగా ఉన్నారు.
గత ప్రభుత్వంలో ఎస్ఐబీ ఓఎస్డీ ప్రభాకర్రావు తాను నిర్వహించిన ఫోన్ట్యాపింగ్లకు సంబంధించిన సమాచారాన్ని తన పైఅధికారుల దృష్టికి తీసుకొచ్చారా.. లేదా.. మొదలైన కోణాల్లో సిట్ అధికారులు వారి నుంచి వాంగ్మూలాన్ని నమోదు చేసినట్టు తెలిసింది. అయితే, దాదాపు 600కు పైగా ఫోన్ నెంబర్లను రివ్యూ కమిటీకి సమర్పించి, ఇవన్నీ కూడా మావోయిస్టులు, మావోయిస్టు సానుభూతిపరులకు సంబంధించినవి గా అప్పటి ఎస్ఐబీ అధికారులు సమాచారమిచ్చినట్టు సిట్ దృష్టికి వచ్చిందని తెలిసింది.
నాంపల్లి కోర్టుకు ప్రభాకరరావు...
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా విచారణ ఎదుర్కొంటున్న మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకరరావు ఈ రోజు ( జూన్ 20) నాంపల్లి కోర్టుకు హాజరు కానున్నారు. గత నెలలో ఆయనకు నాంపల్లి కోర్టు అఫెండర్ నోటీసులు జారీ చేసింది. ఈ రోజు వరకు కోర్టులో హాజరు కాకపోతే ప్రకటిత నిందితుడిగా ఆదేశాలు జారీ చేస్తామని నాంపల్లి కోర్టు తెలిపింది.