
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం (SIB) మాజీ చీఫ్ ప్రభాకర్ రావు నేడు ( జూన్ 23) ఆరోసారి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) విచారణకు హాజరవుతున్నారు. ఇప్పటికే ఆయన్ను సిట్ ఐదుసార్లు విచారించింది.
ఈ రోజు ప్రభాకర్ రావును జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో సిట్ బందం విచారించనుంది. ఈ కేసులో ఆయన వాంగ్మూలం కీలకంగా మారనుంది. గత ప్రభుత్వ హయాంలో కొంతమంది రాజకీయనేతలు.. జర్నలిస్ట్ల ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు ప్రభుత్వం తేల్చింది. ప్రభాకరరావు చెప్పే విషయాలతోనే రాజకీయ పార్టీ నాయకుల ప్రమేయం తెలిసే అవకాశం ఉంది.
ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన ముఖ్య నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు సిట్ బృందం నిర్ధారణకు వచ్చింది. వందల సంఖ్యలో నేతలు, జర్నలిస్టులు ఒకేసారి మావోయిస్టులకు సహకరించారని ఎలా భావించారు... ప్రభాకరరావును అధికారులు ప్రశ్నించారు.
ఇప్పటి వరకు ఐదుసార్లు జరిగిన విచారణలో ప్రభాకరరావు సరైన సమాధానం చెప్పకుండా దాట వేశారని సమాచారం అందుతోంది. దర్యాప్తునకు సహకరించడం లేదనే విషయాన్ని సిట్ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. ఈ రోజు కూడా కొంతమంది రాజకీయ పార్టీల నాయకుల స్టేట్ మెంట్ ను సిట్ అధికారులు రికార్డ్ చేయనున్నారు.