ఫోన్ ట్యాపింగ్ బరితెగింపు!

ఫోన్ ట్యాపింగ్ బరితెగింపు!

తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ ఇప్పుడు యావద్దేశాన్ని కుదిపేస్తోంది. ఈ సంగతులన్నీ ఫోన్ ట్యాపింగ్ కేసులో కర్త, కర్మ, క్రియ ఎవరనేది.. నిందితులు ‘సిట్’ ఎదుట ఇచ్చిన వాంగ్మూలాల ద్వారా కూడా తెలుస్తున్నాయి. ‘తుపాకీ పేల్చింది, 2023 చివరి దాకా స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్​గా పనిచేసిన ప్రభాకరరావు. కానీ, తుపాకీ ఆయనది కాదు. అందులోని తూటాలు ఆయనవి కావు’అని సీనియర్ జర్నలిస్ట్​ ఒకరు అన్నారు.

ఫో న్ ట్యాపింగ్ కోసం ఒక ప్రత్యేక ముఠాను తయారు చేసి, వారికి అన్ని హంగులు సమకూర్చిన వ్యక్తి ప్రభాకరరావు అనే ఆరోపణలున్నాయి. ఆయన నల్గొండ ఎస్పీగా ఉన్నకాలంలో బీబీనగర్ ఎస్.ఐ.గా పనిచేసిన ప్రణీత్​రావును శిష్యునిగా మలచుకున్నారు. ఈ‘ముఠా’ కు ప్రధాన ఆపరేటర్​గా ప్రణీత్ పేరు మార్మోగుతోంది.

2007 బ్యాచ్​కు చెంది ఎస్ఐలలో 2022 నాటికి డిఎస్పీగా పదోన్నతి పొందిన ఏకైక వ్యక్తి  ప్రణీత్​రావు. ఆయన అప్పటి కేసీఆర్ ప్రభుత్వం పట్ల ఎంత విధేయంగా ఉన్నారో,  కేసీఆర్​కు, నాటి
బీఆర్ఎస్ ముఖ్యులకు ఎంతగా నమ్మినబంటుగా మారారో ఈ ప్రమోషన్ ఘటన తెలియజేస్తోంది. రేవంత్ రెడ్డిని రాజకీయంగా అణచివేయడానికి జరిగిన ఫోన్ ట్యాపింగ్ బాగోతానికి ‘ఆపరేషన్ ఆర్.ఆర్’ అని కోడ్  పేరు  పెట్టుకున్నట్టు తెలియవచ్చింది.

తెలంగాణ ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్​కు సంక్రమించిన ‘గ్లామర్’ ఉద్యమ గ్లామర్. అదే ఆయనకు ప్రత్యేక ఆకర్షణ. కానీ, సీఎం కాగానే తన ‘లోపలి మనిషి’ బయటకు వచ్చాడు. ‘అహంకారం’ ఒంటినిండా పులుముకొని పరిపాలన సాగించినట్టు ప్రజాసంఘాలు ఆరోపిస్తుంటాయి. కేసీఆర్ ‘హ్యాట్రిక్’ సాధించడానికి ఎన్ని దొడ్డిదారి పనులు చేశారో కానీ, ఫోన్ ట్యాపింగ్ నేరం ఆయన ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీస్తోంది. 

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ ఫోన్‌‌ ట్యాపింగ్‌‌‌‌కు సంబంధించిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం వెయ్యిమంది నాయకుల ఫోన్​లు ట్యాప్ చేసినట్లు  విచారణలో ‘సిట్’ గుర్తించింది.  తెలంగాణలో 650 మంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుల  ఫోన్లను ట్యాప్ చేసినట్లు కనుగొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌‌కు చెందిన నాయకులపై  ఫోకస్ చేసి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

రేవంత్​ టార్గెట్​గా ట్యాపింగ్​!

మూడోసారి అధికారాన్ని అందుకోవాలని కేసీఆర్ గట్టి ప్రయత్నాలు చేసినట్టు ఫోన్ ట్యాపింగ్ ఉదంతం ఒక రుజువు. రాష్ట్రంలోని ప్రతిపక్ష నాయకులతో సహా, స్వపక్షం బీఆర్ఎస్  నాయకులు, ముఖ్య కార్యకర్తలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, జర్నలిస్టులు, రచయితలు, మేధావులు, కొందరు న్యాయమూర్తుల ఫోన్లను సైతం ట్యాప్ చేయడం చూస్తే. గొలుసు లాగితే  డొంకంత కదులుతున్నట్లుంది. అలాగే పక్క రాష్ట్రంలో నాయకుల ఫోన్లు కూడా జగన్ సూచనల మేరకు ట్యాప్ చేసినట్టు ఒక ప్రచారం సాగుతోంది.

2023 అసెంబ్లీ ఎన్నికలు సమీపించిన కొద్దీ తనకు ప్రమాదకర ప్రత్యర్థిగా రేవంత్ రెడ్డి అవతరించినట్టు కేసీఆర్​కు అర్ధమైంది. అందువల్ల రేవంత్ రెడ్డి ఇంటికి 200 మీటర్ల దూరంలోనే  ట్యాపింగ్ పరికరాలను పెట్టి సంభాషణలను ప్రణీత్​రావు ముఠా రికార్డు చేసినట్టు ఏడాది కిందటే  ప్రచారం జరిగింది.  

సీఎం రేవంత్​ వల్లే సాధ్యమవుతున్నది!

అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ఓటరు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాడు.  దీంతో రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. అయితే, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గురించి రేవంత్ రెడ్డికి అదివరకే కొంత సమాచారం ఉన్నందున దాని సంగతేమిటో అంతు తేల్చాలని ఆయన నిర్ణయించారు. 

దర్యాప్తునకు గాను  ప్రత్యేక  ఇన్వెస్టిగేషన్ టీమ్​ను నియమించారు. కేసీఆర్  కుటుంబ అవినీతి గురించి, అహంకార పూరిత పరిపాలన గురించి బలంగా తీసుకువెళ్లడం వలన రేవంత్ అధికారంలోకి వచ్చారు. రేవంత్ అప్రమత్తంగా లేకపోతే కేసీఆర్ కాంగ్రెస్ నాయకులను ‘పంటికి అందకుండా మింగేసేవారు’ అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

 ప్రభాకర్​రావు ఆదేశాలతోనే..!

ఫోన్ ట్యాపింగ్ కేసు వెలుగులోకి రాగానే  ట్యాపింగ్‌‌లో కీలకంగా వ్యవహరించిన మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు, ఒక తెలుగు న్యూస్ ఛానల్ అధిపతి శ్రవణ్ రావు విదేశాలకు ఉడాయించారు.  ముఠాలోని పోలీసులు అరెస్టయి జైలుకు వెళ్లారు. కొందరు బెయిలుపై విడుదలయ్యారు.  

ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే తాము ట్యాపింగ్​కు పాల్పడినట్టు సిట్ అధికారుల ఎదుట వారు స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన వెసులుబాటుతో ఆయన హైదరాబాద్ తిరిగివచ్చి, సిట్ అధికారుల ముందు విచారణకు హాజరవుతున్నారు. సిట్ అధికారుల విచారణలో ఆయన ప్రశ్నలను దాటవేస్తున్నారని పోలీసువర్గాలంటున్నాయి. అనంతరం వరుసగా జరిగిన విచారణలో ఆయన నుంచి సిట్ అధికారులు కొన్ని కీలక విషయాలను రాబట్టినట్లు తెలుస్తోంది.

ప్రతిష్ట పాతాళానికి..

 ఫోన్ ట్యాపింగ్ కేసులో  కేసీఆర్, జగన్ సూత్రధారులనే ఆరోపణలు  ఒకవేళ  నిజమయితే వాళ్ళ  విశ్వసనీయత, ప్రతిష్ట  పాతాళానికి వెడతాయి. తన ఫోన్ ట్యాప్ అయినట్టుగా ఆధారాలు షర్మిల చూపించగలిగితే ఈ కేసులో పురోగతి రావచ్చు.  ఆధునిక సాంకేతికతను మేళవించి కేసీఆర్, జగన్ వెన్నుపోటు రాజకీయాలను నడిపారని విమర్శలు వస్తున్నాయి. 

జగన్,  కేసీఆర్ కూడబలుక్కొని ఉమ్మడి శత్రువు చంద్రబాబును దెబ్బతీయడానికి ఫోన్ ట్యాపింగ్ కథ నడిపారన్న ఆరోపణలున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కారణంగానే ‘ఓటుకు నోటు కేసు’ వెలుగు చూసిందన్న విషయం అందరికీ తెలిసిందే. ఆ రోజు చంద్రబాబు  ఫోన్ ట్యాప్ చేసినట్టుగా కాల్ రికార్డ్స్ వెల్లడిస్తున్నాయి. అధికారం తమ చేతులలో ఉన్నంతవరకూ తమకు అడ్డూ, అదుపూ ఉండదని కేసీఆర్, కేటీఆర్ కార్యకలాపాలు రుజువు చేస్తున్నట్టుగా ఆరోపణలున్నాయి. 

‘ద ఆర్ట్ ఆఫ్ వార్’ చదివే ఉంటారేమో!

‘సమర్థుడైన పాలకుడు తన సైన్యంలోని అత్యున్నత వ్యవస్థను గూఢచర్యానికి వాడుకుంటేనే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. సైన్యంలో ఉండేవారు గూఢచారులతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండాలి. సామాన్యులకు సాధ్యంకాని పనులు చేయాలంటే ముందుచూపు అవసరం. ముందుచూపు అనేది అనుభవం ద్వారా కూడా సాధ్యం కాదు. 

కేవలం గూఢచారుల నుంచి అందే సమాచారమే ముందుచూపు కలిగిఉంటుంది’ అని క్రీస్తుపూర్వం 3 వ శతాబ్దానికి చెందిన యుద్ధ రంగ నిపుణుడు సుంజు చెప్పాడు.‘ద ఆర్ట్ ఆఫ్ వార్’ అనే సుప్రసిద్ధ పుస్తకంలో  ఇలాంటి విషయాలెన్నో మనం చదవవచ్చు. ద ఆర్ట్ ఆఫ్ వార్ వంటి ఎన్ని పుస్తకాలను కేసీఆర్  నమిలి మింగేశారో తెలియదు. కానీ, రాజకీయ ప్రత్యర్థుల అణచివేత కోసం ఈ దేశంలో ఎవరూ చేయని సాహసోపేత చర్యలకు పాల్పడినట్టు తాజా ఘటనలు రుజువు చేస్తున్నాయి. మొత్తం మీద తెలంగాణ రాజకీయాలను  చెరబట్టి శాశ్వత పాలకులుగా మారిపోదామనుకున్నారేమో?

‘‘ రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థను కేసీఆర్ భ్రష్టు పట్టించినట్టుగా ఏ ముఖ్యమంత్రి ఇదివరకు చేయలేదు. ఉగ్రవాదులతో ప్రాణాలకు తెగించి పోరాడినందుకుగాను ఇచ్చే యాగ్జిలరీ ప్రమోషన్ తన బంధువు దుగ్యాల ప్రణీత్​రావుకు ఇచ్చారు. జీవో 280ని దుర్వినియోగం చేశారు. రాజకీయ ప్రత్యర్థుల ఫోన్లు హ్యాక్  చేసినందుకు బహుమతిగా ఈ ప్రమోషన్ ఇచ్చారు ’’ – అని అప్పట్లో బహుజన సమాజ్ పార్టీ తెలంగాణ బాధ్యునిగా ఉన్న మాజీ ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ చెలరేగిపోయారు. ఆ తర్వాత ఆయన మారుమనసుతో బీఆర్ఎస్​లో  చేరిపోయారు.

 

- ఎస్.కె.జకీర్,  సీనియర్​ జర్నలిస్ట్​-