గ్రేటర్ హైదరాబాద్ లో గ్యాస్పైపులైన్ విస్తరణకు ప్లాన్

 గ్రేటర్ హైదరాబాద్ లో గ్యాస్పైపులైన్ విస్తరణకు ప్లాన్
  • వీలైనంత ఎక్కువ మందికి ఇచ్చేలా సన్నాహాలు
  • సిలిండర్ల అవసరముండదు.. వంటింటిలోకి వచ్చేస్తుంది 
  • ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లోనే అమలు 
  • శామీర్​పేట నుంచి సరఫరా 
  • 100 శాతం పీఎన్​జీ  సిటీ చేయాలన్నదే లక్ష్యం

 హైదరాబాద్​సిటీ, వెలుగు: ఇరాన్ – అమెరికా యుద్ధం ఎఫెక్ట్​తో జంటనగరాల్లో జనాలు గ్యాస్​కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తున్నది. కావాల్సినంత గ్యాస్​అందుబాటులో ఉందని, అవసరం లేకపోయినా బుక్​చేస్తుండడంతో డెలివరీ చేయలేకపోతున్నామని డీలర్లు చెప్తున్నారు. డెలివరీ సందర్భంగా కొన్ని చోట్ల బాయ్స్​ను కొట్టి గ్యాస్​సిలిండర్లు లాక్కునే స్థాయికీ చేరుకుంది. భవిష్యత్​లో ఇలాంటి కష్టాలు ఉండకుండా చేసేందుకు ఆయిల్​కంపెనీలు ప్రత్యేక ప్లాన్లు రెడీ చేస్తున్నాయి. ఇప్పటికే నగరంలో వాడుతున్న  పైప్​లైన్​నేచురల్​గ్యాస్​(పీఎన్​జీ)ను విస్తరించడానికి కార్యచరణ సిద్ధం చేసుకుంటున్నాయి.  

ఇప్పటికే 300 చోట్లకు పైపులైన్

ప్రస్తుతం నగరంలోని ఆయా ప్రాంతాల్లో దాదాపు 300 నివాస సముదాయాలకు పీఎన్​జీ సరఫరా అవుతోంది. హైటెక్​సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి, మియాపూర్​, కూకట్​పల్లి, మణికొండ, కుత్బుల్లాపూర్​, జీడిమెట్ల, సుచిత్ర, కొంపల్లి తదితర ప్రాంతాల్లోని అపార్ట్​మెంట్స్, గేటెడ్​కమ్యూనిటీలు, ఇండిపెండెంట్​ఇండ్ల ప్రాంగణాలకు శామీర్​పేట్​లో ఉన్న  ప్లాంట్ నుంచి అండర్​గ్రౌండ్​పైపులైన్​ద్వారా గ్యాస్​సప్లై చేస్తున్నారు. ఈ గ్యాస్ నేరుగా కిచెన్​లోకే వస్తుండడంతో జనాలు సౌకర్యవంతంగా ఫీలవుతున్నారు. స్విచ్​ఆన్​చేసి కావాల్సినంత వినియోగించుకునే అవకాశం ఉండడంతో  అయిపోతుందనే చింత లేదు. సిలిండర్లను బుక్​చేసుకుని రోజుల తరబడి ఎదురు చూసే పరిస్థితీ ఉండదు. వీరికి గ్యాస్​సరఫరాను భాగ్యనగర్​గ్యాస్​ కంపెనీ...హెచ్​పీసీఎల్, గ్యాస్​అథారిటీ ఆఫ్​ఇండియా (గెయిల్​)తో కలిసి సంయుక్తంగా నిర్వహిస్తోంది. ఇవే కాకుండా కొన్ని ప్రైవేట్​ కంపెనీలు కూడా పీఎన్​జీ సరఫరా చేస్తున్నాయి. 

డిమాండ్ ​పెరగడంతో విస్తరణ

వంటగ్యాస్ సంక్షోభంతో డిమాండ్​పెరుగుతుండడంతో ముందుగా పీఎన్​జీ లైన్లు ఉన్న ప్రాంతాల్లో మరింత మంది వినియోగదారులకు అందించేందుకు కంపెనీలు కసరత్తు చేస్తున్నాయి. ముఖ్యంగా శివారు ప్రాంతాలైన హయత్​నగర్​, వనస్థలిపురం, మేడ్చల్​ కారిడార్​లో పీఎన్​జీ విస్తరణకు సన్నాహాలు చేస్తున్నాయి. మరికొన్ని ప్రైవేట్​కంపెనీలు కూడా కొత్తగా వెలుస్తున్న కాలనీలు, టౌన్​షిప్​లలో గ్యాస్​ గ్రిడ్ల ఏర్పాటుకు సిద్ధమవుతున్నాయి. దశల వారీగా సిటీ అంతా విస్తరించి వంద శాతం పీఎన్​జీ సిటీ చేయాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్నారు. అయితే, ఇది చాలా ఖరీదుతో కూడుకున్నది కావడం, అండర్​గ్రౌండ్​నుంచి పైపులైన్​వేయాల్సి రావడంతో చాలా సమయం తీసుకుంటుందని అంటున్నారు. 

బిల్డర్ల ఆసక్తి...

భారీ సంఖ్యలో అపార్ట్​మెంట్లు, గేటెడ్​కమ్యూనిటీలు నిర్మించే బిల్డర్లు కూడా పీఎన్​జీ వినియోగానికి అనుగుణంగా ప్రాజెక్టులు డిజైన్​చేసుకుంటున్నారు. 80 శాతం కొత్త ప్రాజెక్టుల్లో పీఎన్​జీకి అనుగుణంగా ఏర్పాట్లు చేసుకుంటుండడంతో ఆ స్థాయిలో గ్యాస్​అందించేందుకు కంపెనీలు ప్లాన్​చేసుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం నేచురల్​గ్యాస్​అండ్​ పెట్రోలియం ఆర్డర్​-2026 ప్రకారం  పీఎన్​జీ పనులకు సులభంగానే అనుమతులు ఇస్తుండడంతో విస్తరణ పనులు స్పీడందుకునే అవకాశం ఉంది.  

వెయిటింగ్​లో 2 లక్షల దరఖాస్తులు!

జంటనగరాల్లో పీఎన్​జీ కోసం ఇప్పటికే 2 లక్షల మంది దరఖాస్తు చేసుకుని ఎదురుచూస్తున్నారు. అయితే, ప్రస్తుతం పైప్ లైన్ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లోని దరఖాస్తుదారులకు ఇచ్చేందుకు కంపెనీలు సన్నాహాలు చేస్తున్నాయి. భాగ్యనగర్​గ్యాస్​లిమిటెడ్​పరిధిలో 2,15,698 కనెక్షన్లుండగా, ఇండియల్​ఆయిల్​పరిధిలో 42,354, ఇతర ప్రైవేట్​కంపెనీల పరిధిలో 15,452 కనెక్షన్లు ఉన్నాయి. ఇప్పటికే వచ్చిన అప్లికేషన్లతో పాటు సిలిండర్ల కొరతతో మరిన్ని దరఖాస్తులు వస్తున్నాయని ఆ దిశగా తాము విస్తరణ పనులకు ప్లాన్​చేస్తున్నట్టు కంపెనీల ప్రతినిధులు చెప్తున్నారు.