
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం శంషాబాద్ ఎయిర్పోర్ట్ దక్షిణ భాగంలో రెండో ప్రత్యేక ప్లాస్టిక్ పార్క్ను అభివృద్ధి చేయాలని భావిస్తోందని తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీజీఐఐసీ) ఎండీ విష్ణువర్ధన్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్లో శుక్రవారం తెలంగాణ అండ్ ఆంధ్రా ప్లాస్టిక్స్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (తాప్మా) నిర్వహించిన పాలిమర్స్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ఆయన ఈ విషయం చెప్పారు.
ప్లాస్టిక్ రంగాన్ని అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, దక్షిణ భారతదేశంలో తెలంగాణ అతిపెద్ద ప్లాస్టిక్ హబ్గా నిలిచిందని పేర్కొన్నారు. పెరుగుతున్న డిమాండ్ను తీర్చడానికే రెండో ప్లాస్టిక్ పార్క్ను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ప్రతి జిల్లాలో 'మహిళాశక్తి ఇండస్ట్రియల్ హబ్స్' ద్వారా మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం ఇస్తున్నామని అన్నారు. తెలంగాణను సర్క్యులర్ ఎకానమీ (పునర్వినియోగ ఆర్థికవ్యవస్థ) కేంద్రంగా అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టినట్లు రెడ్డి చెప్పారు.