న్యూఢిల్లీ: పీఎం కుసుమ్ పథకం కింద వ్యవసాయ భూముల్లో సోలార్ ప్లాంట్ల ఏర్పాటు ఆశించిన స్థాయిలో జరగకపోవడంతో ప్రభుత్వం కొత్త ఆలోచన చేస్తోంది. రైతులకు తక్కువ లోన్లు పొందేందుకు సహాయపడే వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధికి ఈ పథకాన్ని లింక్ చేయాలని కేంద్ర కొత్త, రెన్యువబుల్ ఎనర్జీ మంత్రిత్వ శాఖ భావిస్తోంది. దీనివల్ల రైతులు సోలార్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయడానికి, పరికరాలను కొనడానికి తక్కువ ధరలకు లోన్లు దొరుకుతాయి. ఈ ప్రాజెక్ట్ల కోసం బ్యాంకులు సాధారణంగా వసూలు చేసే 8–-11శాతం రేటుతో పోలిస్తే ఏఐఎఫ్ లోన్లను 6 శాతం వడ్డీకి ఇస్తారు. మొత్తం రూ. లక్ష కోట్ల లోన్లు ఇస్తారు. పీఎం కుసుమ్ కాంపోనెంట్ ఏని అగ్రికల్చర్ ఇన్ఫ్రా ఫండ్(ఏఐఎఫ్)తో లింక్ చేయడానికి సంప్రదింపులు జరుగుతున్నాయి.
ఈ సోలార్ ప్రాజెక్ట్ నుంచి ఉత్పత్తి అయిన కరెంటును తక్కువ ధరకే ప్రభుత్వం దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువ ధరకు పవర్ ప్లాంట్ల నుంచి కరెంటును కొనడం ఆపేయవచ్చని ఈ సంగతి తెలిసిన అధికారి ఒకరు చెప్పారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు 2019లో ప్రారంభించిన ‘ప్రధాన్ మంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్థాన్ మహాభియాన్’ (పీఎంకుసుమ్) పథకంలో మూడు భాగాలు ఉన్నాయి. కాంపోనెంట్ -ఏ కింద, వ్యవసాయ భూముల్లో 10 వేల మెగావాట్ల డీసెంట్రలైజ్డ్ గ్రౌండ్ మౌంటెడ్ గ్రిడ్ కనెక్టెడ్ సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తారు. మిగిలిన రెండు భాగాల కింద 20 లక్షల స్టాండెలోన్ సోలార్ పవర్డ్ అగ్రికల్చర్ పంపులను ఏర్పాటు చేస్తారు.
ఇప్పటికే ఉన్న 1.5 మిలియన్ గ్రిడ్-కనెక్ట్ అగ్రికల్చర్ పంపుల సోలారైజేషన్ను చేపడతారు. కాంపోనెంట్ ఏ కింద, వ్యక్తిగత రైతులు, సహకార సంఘాలు, పంచాయతీలు లేదా రైతు ఉత్పత్తి సంస్థలు (ఎఫ్పీఓ) బంజరు లేదా సాగు భూములలో 2 మెగావాట్ల వరకు సామర్థ్యం గల సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలి. ఉత్పత్తి అయిన కరెంటును డిస్కమ్లు కొంటాయి. ధరలను సంబంధిత రాష్ట్ర విద్యుత్ నియంత్రణ కమిషన్లు (ఎస్ఈఆర్సీ) నిర్ణయిస్తాయి. గ్రామీణ భూ యజమానులకు నిరంతర ఆదాయం సమకూర్చేందుకు ఈ పథకాన్ని ప్రారంభించారు. కొనుగోలు చేసిన యూనిట్కు 40 పైసల ఇన్సెంటివ్ లేదా ప్రతి మెగావాట్ల కెపాసిటీకి రూ.6.6 లక్షలు.. ఇందులో ఏది తక్కువైతే అది చెల్లిస్తారు. కేంద్రం ప్రభుత్వం కుసుమ్ పథకాన్ని 2026 ఆర్థిక సంవత్సరం వరకు పొడిగించిందని సంబంధిత అధికారి ఒకరు చెప్పారు.