ఇండియా ప్రధాని నరేంద్ర మోడీ గురించి, ఆయన మాట్లాడే విధానం గురించి పెద్దగా చెప్పక్కర్లేదు. సభల్లో మాట్లాడేటప్పుడు అద్భుతమైన వాక్చాతుర్యంతో జనాన్ని కలుపుకుపోతుంటారు. సోషల్ మీడియాలోనూ మోడీ యాక్టివ్గా ఉంటారు. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లను బాగా వాడుతుంటారు. ట్విట్టర్లో అత్యధిక మంది ఫాలోవర్లున్న మూడో వ్యక్తి మన ప్రధాని. 5 కోట్ల మందికి పైగా ఫాలోవర్లున్నారు. అందుకే మోడీ చేసిన ఓ ట్వీట్ ఇండియాలో ఈ ఏడాది ‘గోల్డెన్ ట్వీట్ ఆఫ్ ది ఇయర్’గా నిలిచింది. 2019 ఎన్నికల్లో బీజేపీ రెండోసారి గెలిచిన తర్వాత ‘సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్.. విజయీ భారత్’ అంటూ ఆయన చేసిన ట్వీట్ను గోల్డెన్ ట్వీట్గా ట్విట్టర్ మంగళవారం ప్రకటించింది. ఎన్నికల ఫలితాలు ప్రకటించిన మే 23న ఫలితాల ట్రెండ్స్ చూసి మధ్యాహ్నం 2.42 గంటలకు మోడీ ఈ ట్వీట్ చేశారు. ‘మళ్లీ గెలిచాం. అందరం కలిసి బలమైన ఇండియాను నిర్మిద్దాం’ అని ట్వీట్ చేశారు. మోడీ చేసిన ఈ ట్వీట్కు 4.2 లక్షల లైకులు రాగా, 1.17 లక్షల మంది రీ ట్వీట్ చేశారు. ఈ ఏడాది ఎక్కువ మంది లైక్ చేసిన ట్వీట్ కూడా ఇదే. 2019 ఎన్నికల్లో 303 స్థానాల్లో గెలిచి అధికారం నిలబెట్టుకుంది. ఒకే పార్టీ ఇంత భారీస్థాయిలో సీట్లు గెలుచుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం గత మూడు దశాబ్దాల్లో ఇది రెండోసారి. మొత్తంగా ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 353 సీట్లు గెలుచుకుంది.
హాష్ట్యాగుల్లో లోక్సభ ఎలక్షన్స్2019 టాప్
స్పోర్ట్స్ విషయానికి వస్తే మహేంద్ర సింగ్ ధోనీ పుట్టిన రోజున విరాట్కోహ్లీ విష్ చేస్తూ చేసిన ట్వీట్ ఫేమస్ అయింది. ఇక ఎంటర్టెయిన్మెంట్ విభాగంలో హీరో విజయ్ తన బిగిల్ సినిమా పోస్టర్ను రిలీజ్ చేస్తూ చేసిన ట్వీట్ ఎక్కువ రీ ట్వీట్లు చేసిన ట్వీట్గా నిలిచింది. హాష్ట్యాగ్ల విషయానికి వస్తే లోక్సభఎలక్షన్స్2019 టాప్లో నిలిచింది. తర్వాత స్థానంలో చంద్రయాన్2, సీడబ్ల్యూసీ19, పుల్వామా, ఆర్టికల్370 హాష్ట్యాగ్లు ఉన్నాయి.