పాట్నా: బిహార్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ‘కట్టా’ (దేశీయంగా తయారు చేసిన తుపాకీ) వ్యాఖ్యలను ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ విమర్శించారు. దేశంలో ఒక ప్రధాని ఇటువంటి మాటలు వాడటం తాను ఎప్పుడు వినలేదని అన్నారు.
బిహార్ ఎన్నికల ప్రచారంలో మోదీ ఆదివారం మాట్లాడుతూ.. ఇండియా కూటమి సీఎం అభ్యర్థిగా తేజస్వీ యాదవ్ ను కాంగ్రెస్ అంగీకరించలేదన్నారు. ఆర్జేడీ నేతలు ‘కట్టా’ను ఆ పార్టీ తలపై పెట్టిన తర్వాతే అంగీకరించిందన్నారు. దీనిపై సోమవారం పాట్నాలో తేజస్వీ విలేకర్లతో మాట్లాడారు. ‘‘ప్రధాని వ్యాఖ్యపై నేను మాట్లాడటానికి ఏం లేదు.
దేశంలో ఒక ప్రధాని ఇటువంటి మాటలు ఉపయోగించడం నేను ఎప్పుడూ వినలేదు. ఇది ఆయన ఆలోచనా విధానాన్ని చూపిస్తుంది. ఆయన గుజరాత్కు వెళ్లినప్పుడు ఐటీ సంస్థలు, సెమీకండక్టర్ యూనిట్లు, డేటా సెంటర్ల గురించి మాట్లాడతారు. బిహార్ కు వస్తే మాత్రం ‘కట్టా’ ప్రస్తావన లేవనెత్తుతారు” అని తేజస్వీ యాదవ్ ఆరోపించారు.
