సికింద్రాబాద్-విశాఖపట్టణం మధ్య రెండో వందేభారత్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 12 వ తేదీ మంగళవారం రోజున వర్చువల్ గా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. సికింద్రాబాద్ ప్లాట్ ఫామ్ నంబర్ 10 పైన వందేభారత్ రైలుకు పచ్చ జండా ఊపి కిషన్ రెడ్డి, రైల్వే అధికారులు ప్రారంభించారు.
ఈ నెల13 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నది. ఈ వందేభారత్ ఎక్స్ప్రెస్ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఆరు రోజుల పాటు నడవనుంది. కేవలం గురువారం మాత్రమే ఈ వందేభారత్ రైలు నడవదు. వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట రైల్వేస్టేషన్లలో ఆగనుంది. మొత్తం 530 మంది ఇందులో ప్రయాణించవచ్చు.
ఇది తెలుగు రాష్ట్రాల మధ్య నడిచే మూడో వందే భారత్ రైలు కాగా.. సికింద్రాబాద్ – విశాఖపట్నం మధ్య రెండోది కావడం విశేషం. రాష్ట్రానికి మరో వందేభారత్ రైలు రావడంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.