వికసిత భారత్ లక్ష్యానికి..సేవా తీర్థ్ పునాది: ప్రధాని మోదీ

వికసిత భారత్ లక్ష్యానికి..సేవా తీర్థ్  పునాది: ప్రధాని మోదీ
  • పీఎంవో భవనం ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ
  • కర్తవ్య భవన్, పీఎంవో భవనాలు ప్రజా కేంద్రక పాలనకు ప్రతిబింబాలని కామెంట్
  • బ్రిటిష్ పాలన గుర్తులను చెరిపేస్తున్నామన్న ప్రధాని

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో సేవా తీర్థ్, కర్తవ్య భవన్ భవనాల నిర్మాణం వికసిత్ భారత్ దిశగా కీలక మైలురాయి అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇది దేశ అభివృద్ధితోపాటు కేంద్ర ప్రభుత్వ ప్రజా కేంద్రక పాలనకు ప్రతిబింబాలుగా నిలుస్తాయన్నారు. 

ఢిల్లీలో నూతనంగా నిర్మించిన సేవా తీర్థ్ (ప్రధాన మంత్రి కార్యాలయం), సెంట్రల్ సెక్రటేరియెట్(కర్తవ్య భవన్ 1, 2) భవనాలను ప్రధాని శుక్రవారం ప్రారంభించారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి, సీనియర్ బ్యూరోక్రాట్స్, కేంద్ర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ.. బ్రిటిష్ కాలంలో నిర్మితమైన సౌత్ బ్లాక్, నార్త్ బ్లాక్ నుంచి ఈ కార్యాలయాలను మార్చడం వలసవాద మనస్తత్వాన్ని చెరిపేయడమేనని చెప్పారు. 

"సేవా తీర్థ్, కర్తవ్య భవన్ 1, 2 భారతదేశం వికసిత భారత్ పథంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తాయి. ఇవి పౌరుల ఆధారిత పరిపాలన మరియు జాతీయ పురోగతిని మా అంకితభావాన్ని ప్రతిబింబిస్తాయి" అని ఆయన పేర్కొన్నారు. గత 11 సంవత్సరాల్లో పౌరులు పరిపాలన నిర్ణయాలలో కేంద్రమైన కొత్త మోడల్ అవతరించిందని చెప్పారు. 

"నాగరిక్ దేవో భవ" (పౌరుడు దేవుడితో సమానం) అన్న మాట మాత్రమే కాదు, అది కార్యరూపం దాల్చాలన్నారు. "సేవా తీర్థ్, కర్తవ్య భవనాల్లో తీసుకునే ప్రతీ నిర్ణయం కేవలం ఫైల్ ఆమోదమే కాకుండా, 2047లో వికసిత భారత్ దిశను నిర్ణయిస్తుంది" అని ఆకాంక్షించారు. 

సౌత్ బ్లాక్, నార్త్ బ్లాక్ వంటి చారిత్రక భవనాలు ఇప్పటివరకు రక్షణ, హోం, ఆర్థిక మంత్రిత్వ శాఖలు పీఎంవో వంటి కీలక శాఖలు ఉండేవి. ఇవి బ్రిటిష్ సామ్రాజ్య ఆకాంక్షలను ప్రతిబింబించడానికి నిర్మించబడ్డాయని, కానీ సేవా తీర్థ్, కర్తవ్య భవనాలు ప్రజల ఆకాంక్షలను అమలు చేయడానికి నిర్మించబడ్డాయని ప్రధాని అన్నారు. 

స్వాతంత్ర్యం అనంతరం కూడా బానిసత్వపు చిహ్నాలు ఇంకా ఇక్కడ కొనసాగడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. "ఇక్కడ తీసుకునే నిర్ణయాలు 140 కోట్ల పౌరుల ఆకాంక్షలను ముందుకు తీసుకెళ్లేందుకు పునాదిగా నిలుస్తాయి, కాకుండా ఒక రాజు సంకల్పాన్ని ప్రతిబింబించవు. 

ఈ ఆత్మతోనే, నేను సేవా తీర్థ్ మరియు కర్తవ్య భవనాలను దేశ ప్రజలపట్ల అంకితం చేస్తున్నాను" అని ప్రధాని అన్నారు. "భారతదేశం ప్రస్తుతం 'సంస్కరణల ఎక్స్‌ప్రెస్'పై ప్రయాణిస్తోంది. 

అంతర్జాతీయ సంబంధాలలో కొత్త అధ్యాయాలను రాస్తోంది మరియు వాణిజ్య ఒప్పందాల ద్వారా కొత్త తలుపులను తెరుస్తోంది" అని మోదీ పేర్కొన్నారు. సేవా తీర్థ్,  కర్తవ్య భవనాలు జాతీయ లక్ష్యాలను సాధించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయన్నారు. 

"రేస్ కోర్స్ రోడ్, ప్రధాని నివాసం ఉండే చోటు. ఇప్పుడు 'లోక కళ్యాణ్ మార్గ్'గా పేరుపొందింది. ఈ పేరు మార్పు కేవలం పదాలు మార్చడం కాదు, అది అధికారపు మానసికతను సేవా ఆత్మతో మార్పు చేసే ప్రయత్నం" అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా, సేవా తీర్థ్ భవనం బొమ్మతో కూడిన పోస్టల్ స్టాంపు, నాణేన్ని ప్రధాని విడుదల చేశారు.

స్వాతంత్ర్యానంతరం తొలిసారిగా పీఎంఓ తరలింపు

స్వాతంత్ర్యానంతరం పీఎంఓ కొత్త భవనంలోకి మారడం ఇదే తొలిసారి. సరిగ్గా 95 ఏండ్ల క్రితం ఇదే రోజున ఢిల్లీని భారత రాజధానిగా అధికారికంగా ప్రారంభించారు. ఆ రోజునే ప్రధాని మోదీ కొత్త కార్యాలయంలోకి మారారు. పాలనాపరమైన సామర్థ్యాన్ని పెంపొందించడం, కీలక కార్యనిర్వాహక విధులను ఒకే చోటకు చేర్చే లక్ష్యంతో అత్యాధునిక సదుపాయాలతో ఈ సముదాయాన్ని నిర్మించారు. 

భారత పరిపాలన వ్యవస్థలో ఇదొక మైలురాయి అని ప్రభుత్వం అభివర్ణించింది. అత్యాధునిక వసతులున్న ఈ భవనం నుంచే ప్రధాని మోదీ ఇక కార్యకలాపాలు కొనసాగించనున్నారు. ‘సేవాతీర్థ్’ లోకి అడుగుపెట్టిన తర్వాత ప్రధాని మోదీ కీలక ఫైళ్లపై సంతకం చేశారు. రైతులు, మహిళలు, యువత, బలహీన వర్గాల ప్రయోజనాలే లక్ష్యంగా పలు పథకాలకు ఆయన ఆమోదం తెలిపారు.

సౌత్ బ్లాక్‌లో చివరి కేబినెట్ భేటీ 

ప్రధానిమోదీ శుక్రవారం సౌత్ బ్లాక్‌లోని బ్రిటిష్ కాలపు కార్యాలయంలో తన చివరి కేబినెట్ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో అందరు కేబినెట్ మంత్రులు పాల్గొన్నారు. 1900ల ప్రారంభంలో బ్రిటిష్ శిల్పి హెర్బర్ట్ బేకర్ రూపొందించిన బ్రిటిష్ కాలపు ఈ ప్రభుత్వ కార్యాలయంలో జరిగిన చివరి కేబినెట్ సమావేశం ఇది.