చంద్రబాబు సభలో తొక్కిసలాటపై ప్రధాని మోడీ దిగ్బ్రాంతి

చంద్రబాబు సభలో తొక్కిసలాటపై ప్రధాని మోడీ దిగ్బ్రాంతి

నెల్లూరు జిల్లా కందుకూరు తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయలను, గాయపడిన వారికి రూ. 50 వేల పరిహారాన్ని ప్రకటించారు. "ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు బహిరంగ సభలో జరిగిన దుర్ఘటన వల్ల తీవ్రంగా కలత చెందాను. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. పిఎంఎన్‌ఆర్‌ఎఫ్‌ నుంచి మృతుల కుటుంబసభ్యులకు రూ.2 లక్షలు,క్షతగాత్రులకు రూ. 50,000 చొప్పున ఎక్స్ గ్రేషియా మంజూరు చేస్తాం"  అని పీఎంవో ట్వీట్ చేసింది. 

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు బహిరంగ  సభలో ఈ  తొక్కిసలాట  జరగగా ఎనిమిది మంది చనిపోయారు. చంద్రబాబు సభకు ప్రజలు, కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు. దీంతో అక్కడ తోపులాట జరిగి కొందరు కార్యకర్తలు రోడ్డు పక్కనున్న డ్రైనేజీ కాల్వలో పడిపోయారు. వెంటనే టీడీపీ లీడర్లు, మిగతా కార్యకర్తలు అప్రమత్తమై గాయపడిన వారిని కందుకూరు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ 8 మంది చనిపోయారు. మిగతా వారు చికిత్స పొందుతున్నారు. దీంతో చంద్రబాబు తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేశారు. ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు.మృతుల కుటుంబాలకు తమ పార్టీ తరపున రూ.10 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా అందిస్తామని ప్రకటించారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు.